ప్రియురాలిని చూసేందుకు వెళ్ళిన యువకుడిపై దాడి
ABN , First Publish Date - 2022-01-11T15:44:58+05:30 IST
కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి వద్ద ప్రేమికురాలిని చూసేందుకు వెళ్ళిన దళిత యువకుడిని స్థానికులు చెట్టుకు కట్టి చితకబాదిన సంఘటన తీవ్ర సంచలనం కలిగించింది. కోయంబత్తూరు జిల్లా అనైమలై సమీపం శక్తినగర్లో
చెన్నై: కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి వద్ద ప్రేమికురాలిని చూసేందుకు వెళ్ళిన దళిత యువకుడిని స్థానికులు చెట్టుకు కట్టి చితకబాదిన సంఘటన తీవ్ర సంచలనం కలిగించింది. కోయంబత్తూరు జిల్లా అనైమలై సమీపం శక్తినగర్లో హరిహర సుధాకర్ (18) అనే దళిత యువకుడు నివసిస్తున్నాడు. ఆ ప్రాంతంలోని మేజర్ రామసామి అనే వ్యక్తికి చెందిన తోటలో ఐదేళ్లుగా కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మూడేళ్ళ క్రితం మదురైకి చెందిన 22 యేళ్ళ యువతి ఆ తోటలో వంట పనిమనిషిగా చేరింది. సుధాకర్కు ఆమెతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయం తెలిసిన తోట యజమాని అతడిని తీవ్రంగా మందలించాడు. దీంతో ఆ తోటలో సుధాకర్ పనిమానేసి మరో చోట చేరాడు. ఆ తర్వాత కూడా సుధాకర్ ఆ యువతితో సెల్ఫోన్లో మాట్లాడుతూ తరచూ కలుసుకుంటూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో రామసామి తోటకు వెళ్ళిన సుధాకర్ తన ప్రియురాలితో మాట్లాడేం దుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో అక్కడే తోటలో పనిచేస్తున్న రామన్, కాళిముత్తు, కేశవన్, రాజాత్తి, ఉత్తరాదికి చెందిన ఇద్దరు కలిసి సుధాకర్ను ఓ చెట్టుకు కట్టిపడేశాడు. ఆలోగా తోట యజమాని అక్కడకు చేరుకోగా కార్మికులు సుధాకరన్ను కర్రలతో కొట్టారు. తీవ్రంగా గాయపడిన సుధాకర్ సొమ్మసిల్లి పడిపోయాడు. ఆ తర్వాత అతడిని కార్మికులు విడిచిపెట్టారు. వంటి నిండా గాయాలతో ఇంటికి చేరుకున్న సుధాకర్ను చూసి కుటుంబీకులు ఆందోళన చెందారు. కుమారుడిపై జరిగిన దాడి గురించి సుధాకర్ తండ్రి కుమార్ ఆనమలై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గాయపడిన సుధాకర్ను వేట్టైకారన్ పుదూరు ఆస్పత్రికి తరలించి దాడి చేసిన ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈసంఘటనపై దళిత సంఘాల నాయకులు పొల్లాచ్చి సబ్కలెక్టర్ కార్యాలయం వద్ధ ధర్నా జరిపారు. సుధాకర్పై దాడి చేసిన వారిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.