ప్రేమించి పెళ్లి చేసుకున్న నవ దంపతుల దారుణహత్య
ABN , First Publish Date - 2022-06-14T15:05:19+05:30 IST
తంజావూరు జిల్లాలో వివాహం చేసుకున్న ఐదు రోజుల్లోనే వధూవరులు దారుణ హత్యకు గురయ్యారు. కుంభకోణం సమీపం తుళుక్కవేలి ప్రాంతానికి చెందిన
- ఇంటికి తిరిగిరావాలని యువతి సోదరుడి ఆహ్వానం
- రాగానే దంపతులపై కత్తులతో దాడి
పెరంబూర్(చెన్నై), జూన్ 12: తంజావూరు జిల్లాలో వివాహం చేసుకున్న ఐదు రోజుల్లోనే వధూవరులు దారుణ హత్యకు గురయ్యారు. కుంభకోణం సమీపం తుళుక్కవేలి ప్రాంతానికి చెందిన శరణ్య (24) తిరువణ్ణామలై జిల్లాకు చెందిన మోహన్ (31)ను ప్రేమించింది. ఇద్దరు వేర్వేరు సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో శరణ్య కుటుంబీకులు వివాహానికి అంగీకరించలేదు. అదే సమయంలో ఆమెకు బావమరిది రంజిత్తో వివాహం చేసేందుకు ఆమె అన్న శక్తివేల్ ఏర్పాట్లు చేపట్టాడు. ఈ విషయం తెలుసుకున్న శరణ్య ఇంటి నుంచి పారిపోయి ఐదు రోజుల క్రితం వివాహం చేసుకొని చెన్నైలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో, నవదంపతులను ఇంటికి రావాలని శరణ్య సోదరుడు శక్తివేల్ పిలుపుతో ఇద్దరూ సోమవారం ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో ప్రవేశించే సమయంలో అందజేసిన నీళ్లతో దంపతులు కాళ్లు శుభ్రపరచుకొనే సమయంలో శక్తివేల్, రంజిత్ కత్తులతో వారిపై దాడిచేసి దారుణంగా హతమార్చారు. చోళపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం కోసం కుంభకోణం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శక్తివేల్, అతడి బావమరిది రంజిత్ కుంభకోణం పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో సంచలనం రేపింది.