మరణంలోనూ వీడని స్నేహం!
ABN , First Publish Date - 2022-09-10T14:16:53+05:30 IST
మరణంలోనూ ఆ స్నేహితులు విడిపోలేదు. కలిసి చదువుకుంటున్న ఆ ముగ్గురూ, ప్రమాదంలో కలిసే ప్రాణాలు విడిచారు. అదుపు తప్పిన కారు
- బావిలో కారు పడి ముగ్గురు విద్యార్థుల దుర్మరణం
- కోవై జిల్లాలో విషాదం
పెరంబూర్(చెన్నై), సెప్టెంబరు 9: మరణంలోనూ ఆ స్నేహితులు విడిపోలేదు. కలిసి చదువుకుంటున్న ఆ ముగ్గురూ, ప్రమాదంలో కలిసే ప్రాణాలు విడిచారు. అదుపు తప్పిన కారు రోడ్డు పక్కనే ఉన్న 120 అడుగుల బావిలో పడడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వివరాలిలా... కోయంబత్తూర్(Coimbatore) జిల్లా వడవల్లి నవావూర్కు చెందిన విఘ్నేశ్బాబు కుమారుడు ఆత్రాస్ (18) ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. ఆత్రాస్ తన స్నేహితులు వడవల్లి ఎస్పీ నగర్కు చెందిన రోషన్ (19), రవి (18), నందనన్ (18)లతో కలసి గురువారం రాత్రి పులువపట్టిలో ఉన్న ఓ క్లబ్లో జరిగిన ఓనం వేడుకల్లో పాల్గొన్నాడు. రాత్రి అక్కడే బసచేసిన వారు కళాశాల కు వెళ్లేందుకు శుక్రవారం ఉదయం కారులో బయల్దేరారు. రోషన్ నడుపుతున్న కారు తెన్నమనల్లూర్ కరికాళియమ్మన్ ఆలయ ప్రాంతంలో వస్తుండగా హఠాత్తుగా అదుపుతప్పి రోడ్డు పక్కనే 120 అడుగుల లోతైన వ్యవసాయ బావిలో పడిపోయింది. రోషన్ కారు నుంచి బయటపడి, చుట్టుపక్కల వారికి సమాచారం అందించి, సాయం చేయాలని అభ్యర్థించాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు, అగ్నిమాపకశాఖ సిబ్బంది అక్కడకు చేరుకొని, రెండుగంటల పాటు శ్రమించి కారును వెలికితీశారు. కానీ అప్పటికే అందులోని ముగ్గురూ మరణించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.