వాహన డిజైనింగ్, బ్యాటరీ నాణ్యతలో లోపాల వల్లే అగ్నిప్రమాదాలు: రవ్నీత్ ఎస్ ఫోఖేలా
ABN , First Publish Date - 2022-07-02T00:20:45+05:30 IST
ఎలక్ట్రిక్ వాహనాలు (EV) ఇటీవల వరుసగా అగ్నిప్రమాదానికి గురవుతుండడంపై విద్యుత్ వాహన సంస్థ ఎథర్ ఎనర్జీ
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలు (EV) ఇటీవల వరుసగా అగ్నిప్రమాదానికి గురవుతుండడంపై విద్యుత్ వాహన సంస్థ ఎథర్ ఎనర్జీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రవ్నీత్ ఎస్.ఫోఖేలా (Ravneet S. Phokela) స్పందించారు. వాహన డిజైనింగ్, బ్యాటరీ నాణ్యతలో లోపాలే అగ్ని ప్రమాదాలకు కారణమని అన్నారు. ఈవీకి బ్యాటరీ ఎంతో కీలకమని, వినియోగదారుల భద్రతను పరిగణలోకి తీసుకుని బ్యాటరీల రూపకల్పనకు తామెంతగానో కృషి చేస్తున్నట్టు చెప్పారు.
భారతదేశంలో నేడు అమ్ముడవుతున్న ప్రతి 10 స్కూటర్లలో ఒకటి ఈవీ స్కూటర్ పేర్కొన్నారు. గత ఏడాదిగా ఈవీల రంగంలో గణనీయమైన వృద్ధి కనిపిస్తోందన్నారు. ఇటీవలి కాలంలో ఈవీల పరంగా కొన్ని దురుదృష్టకర సంఘటనలు జరిగినా అమ్మకాల పరంగా క్షీణత ఏమీ లేదన్నారు. ఈవీలలో ఎదురవుతున్న సమస్యలకు తక్షణమే తగిన పరిష్కారాలను కనుగొనకపోతే అది దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావాలను చూపే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈవీలలో బ్యాటరీలు విఫలం కావడానికి ప్రధాన కారణం మన దేశ పరిస్ధితులకు అనుగుణంగా వాటిని ఓఈఎంలు డిజైన్ చేయకపోవడమేనని ఇటీవలి కాలంలో నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. రవ్నీత్ కూడా దీనిని అంగీకరించారు. ఈవీ పరిశ్రమలో వృద్ధి చూసి అవగాహన లేని వారు కూడా ఈ రంగంలో అడుగుపెడుతున్నారని అన్నారు.
అది పెద్ద సమస్య కాకపోయినా, భారతీయ పరిస్థితులకనుగుణంగా డిజైనింగ్, టెస్టింగ్, వాలిడేషన్ చేయకపోవడం పెద్ద సమస్యగా మారిందన్నారు. భారత వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రామాణిక నిబంధనలకు ఆవల మెరుగైన ప్రమాణాలను ప్రతి ఓఈఎం నిర్దేశించుకుంటే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు.
ఇంజినీరింగ్, టెస్టింగ్పై తాము పలు పరిశోధనలు చేశామన్నారు. భారత వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తమ వాహనాలను డిజైన్ చేశామన్నారు. సేఫ్టీ అనేది తమ దగ్గర కేవలం చెక్బాక్స్ ఐటెమ్ కాదని, అది తమకు అది అత్యంత ప్రధానమైనదని అన్నారు. తమ మొదటి వాహనాన్ని 2018లో విడుదల చేయడానికి ఐదేళ్ల ముందుగానే బ్యాటరీ ప్యాక్లను అభివృద్ధి చేశామన్నారు. ఓ స్టార్టప్ సంస్థగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ త్వరలోనే నాలుగో తరం బ్యాటరీ ప్యాక్ విడుదల చేయబోతున్నట్టు రవ్నీత్ తెలిపారు.