ఈసీబీ మరింత ‘వడ్డి’ంపు వడ్డీ రేట్లు 0.75% పెంపు
ABN , First Publish Date - 2022-10-28T03:07:17+05:30 IST
యూరో జోన్లో ‘వడ్డిం’పుల పర్వం కొనసాగుతోంది. యూరోపియన్ కేంద్ర బ్యాంక్ (ఈసీబీ) కీలక వడ్డీ రేట్లను మరో ముప్పావు (0.75 శాతం) శాతం పెంచింది...
ఫ్రాంక్ఫర్ట్: యూరో జోన్లో ‘వడ్డిం’పుల పర్వం కొనసాగుతోంది. యూరోపియన్ కేంద్ర బ్యాంక్ (ఈసీబీ) కీలక వడ్డీ రేట్లను మరో ముప్పావు (0.75 శాతం) శాతం పెంచింది. యూరో కరెన్సీ అమల్లోకి వచ్చిన తర్వాత ఈసీబీ వడ్డీ రేట్లు ఇంత భారీగా పెంచడం ఇదే మొదటిసారి. దీంతో యూరో జోన్లో కనసీ వడ్డీ రేట్లు 1.25 శాతం నుంచి 2 శాతానికి చేరాయి. చుక్కలంటిన ధరల (ద్రవ్యోల్బణం) సెగ తగ్గించేందుకు ఇంతకంటే మరో మార్గం లేదని ఈసీబీ భావిస్తోంది. అధిక వడ్డీ రేట్లతో ఆర్థిక మాంద్యం ముంచుకొచ్చే ప్రమాదం ఉందని హెచ్చరికలు వినిపిస్తున్నా ఈసీబీ ఈ చర్య తీసుకోవడం విశేషం. 9.9 శాతానికి చేరిన ద్రవ్యోల్బణం 2.4 శాతానికి దిగొచ్చే వరకు యూరో జోన్లో వడ్డీ రేట్ల పెంపు తప్పదని భావిస్తున్నారు.
కోలుకుంటున్న అమెరికా
అమెరికా ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 2 శాతం వరకు ఉంటుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ సంవత్సరం తొలి ఆరు నెలలు అమెరికా జీడీపీ వృద్ధి రేటు మైన్సకు పడిపోయింది. దీంతో టెక్నికల్గా అమెరికా ఆర్థిక మాంద్యంలోకి వెళ్లినట్టయింది. అయితే పెరుగుతున్న ఉద్యోగావకాశాలు, తగ్గని వినియోగదారులు ఖర్చులు మూడో త్రైమాసికంలో అమెరికా ఆర్థిక వ్యవస్థను ఆదుకున్నట్టు ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.