లాభాలతో వారాంతం.. Sensex 462 పాయింట్లు వృద్ధి
ABN , First Publish Date - 2022-06-24T22:10:12+05:30 IST
దేశీయ ఈక్విటీ మార్కెట్లు(Eqity markets) వరుసగా రెండవ రోజు, వారాంతం శుక్రవారం సెషన్లో లాభాలతో ముగిశాయి.

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు(Eqity markets) వరుసగా రెండవ రోజు, వారాంతం శుక్రవారం సెషన్లో గణనీయ లాభాలతో ముగిశాయి. ఆటోమొబైల్, బ్యాంకింగ్, కన్స్యూమర్ షేర్లపై మదుపర్ల కొనుగోలు ఆసక్తి చూపడం, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(RIL) దన్నుతో బీఎస్ఈ సెన్సెక్స్(Sensex) 462 పాయింట్లు లేదా 0.88 శాతం లాభపడి 52,728 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదేబాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ(Nifty) 143 పాయింట్లు లేదా 0.92 శాతం మెరుగుపడి 15,700 మార్క్ దిగువన 15,699 వద్ద స్థిరపడింది. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా సానుకూలంగానే ముగిశాయి. నిఫ్టీ మిడ్క్యాప్(Midcap) 100 సూచీ 1.21 శాతం వృద్ధి చెందగా.. స్మాల్ క్యాప్(Small cap) సూచీ 1.31 శాతం మేర బలపడింది.
నిఫ్టీపై 15 రంగాల్లో 14 సూచీలు గ్రీన్గా ముగిశాయి. నిఫ్టీ ఆటో, నిఫ్టీ ప్రైవేటు బ్యాంక్, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్, నిఫ్టీ ఎఫ్ఎంసీజీలు వరుసగా 1.97 శాతం, 1.75 శాతం, 1.56 శాతం, 1.24 శాతం చొప్పున లాభపడ్డాయి. కాగా నిఫ్టీ ఐటీ సూచీ 0.89 శాతం మేర దిగజారింది.
ప్రత్యేకంగా స్టాకుల విషయానికి వస్తే.. ఎంఅండ్ఎం(MM) నిఫ్టీపై టాప్ గెయినర్గా నిలిచింది. ఈ స్టాక్ 4.36 శాతం మేర పెరిగి రూ.1072.50 వద్ద ముగిసింది. ఆ తర్వాత హీరోమోటోకార్ప్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హిందుస్తాన్ యూనిలీవర్ షేర్లు గణనీయమైన లాభాలతో ముగిశాయి. నష్టపోయిన స్టాకుల జాబితాలో టెక్ మహింద్రా, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, విప్రో, సన్ఫార్మా షేర్లు ఉన్నాయి. మరోవైపు దేశంలోనే అతిపెద్ద బీమా కంపెనీ అయిన ఎల్ఐసీ షేర్ల(Lic Shares) పతనం కొనసాగుతోంది. శుక్రవారం కూడా ఎల్ఐసీ షేర్లు 0.48 శాతం మేర నష్టపోయి రూ.661.70 వద్ద ముగిశాయి. మొత్తంగా బీఎస్ఈపై 2,396 స్టాకులు లాభపడగా 909 షేర్లు నష్టాల్లో ముగిశాయి.