వచ్చే దశాబ్దంలో 11% వృద్ధి సాధ్యమే..
ABN , First Publish Date - 2022-08-14T09:14:11+05:30 IST
దేశ జనాభాలో అధిక శాతంగా ఉన్న యువతకు విరివిగా ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు వస్తు తయారీ, ఎగుమతులను పెంచగలిగితే వచ్చే దశాబ్దంలో 11.
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైకేల్ పాత్ర
న్యూఢిల్లీ: దేశ జనాభాలో అధిక శాతంగా ఉన్న యువతకు విరివిగా ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు వస్తు తయారీ, ఎగుమతులను పెంచగలిగితే వచ్చే దశాబ్దంలో 11 శాతం జీడీపీ వృద్ధి సాధ్యమేనని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైకేల్ పాత్ర అభిప్రాయపడ్డారు. సవాళ్లను అధిగమించి వృద్ధి రేటును రెండంకెల స్థాయికి పెంచగలిగితే, 2031కల్లా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించగలదన్నారు. ఆర్బీఐ భువనేశ్వర్ బ్రాంచ్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. దేశ జీడీపీలో మాన్యుఫాక్చరింగ్ వాటాను కనీసం 25 శాతానికి పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రస్తుతం భారత వస్తు, సేవల వార్షిక ఎగుమతులు 80,000 కోట్ల డాలర్ల స్థాయిలో ఉన్నాయి. ప్రపంచ ఎగుమతుల్లో ఇది కేవలం 2.7 శాతమే. ప్రభుత్వ లక్ష్యం మేరకు 2030 నాటికి ఎగుమతులు లక్ష కోట్ల డాలర్ల స్థాయికి పెరిగితే, ప్రపంచ ఎగుమతుల్లో మన వాటా 5 శాతానికి చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు. తద్వారా భారత్ ఎగుమతుల హబ్గా మారుతుందన్నారు.