చిన్న సిమెంట్ కంపెనీలపై ఒత్తిడి
ABN , First Publish Date - 2022-07-03T09:13:18+05:30 IST
సిమెంట్ రంగంలోని దిగ్గజ కంపెనీల సామర్థ్యాల విస్తరణ చిన్న సిమెంట్ కంపెనీలకు సవాలు కానుంది.

దిగ్గజ కంపెనీల సామర్థ్యాల పెంపు ప్రభావమే కారణం
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినె్స): సిమెంట్ రంగంలోని దిగ్గజ కంపెనీల సామర్థ్యాల విస్తరణ చిన్న సిమెంట్ కంపెనీలకు సవాలు కానుంది. భవిష్యత్తులో మార్కెట్లో దిగ్గజ కంపెనీలతో పోటీ పడడం చిన్న కంపెనీలకు కష్టం కాగలదని, ధరల పోటీని తట్టుకోలేక పోవచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. చిన్న కంపెనీల మార్జిన్లపై ఒత్తిడి పెరిగే వీలుందని అంటున్నారు. స్విట్జర్లాండ్కు చెందిన హోల్సిమ్ గ్రూప్నకు చెందిన సిమెంట్ వ్యాపారాన్ని 1,060 కోట్ల డాలర్లకు అదానీ గ్రూప్ కొనుగోలు చేసింది. అంతేకాకుండా అంబుజా, ఏసీసీ ప్లాంట్ల సామర్థ్యాలను మరింతగా పెంచన్నుట్లు ప్రకటించింది. మరోవైపు సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకోవడానికి భారీగా పెట్టుబడులు పెడుతున్నట్లు దేశీయ సిమెంట్ దిగ్గజం అలా్ట్రటెక్ సిమెంట్ ప్రకటించింది. వచ్చే రెండేళ్లలో సిమెంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 1.4 కోట్ల టన్నుల నుంచి 2.5 కోట్ల టన్నులకు పెంచుకోవాలని నిర్ణయించినట్లు జేఎ్సడబ్ల్యూ సిమెంట్ వెల్లడించింది. 2030 నాటికి సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 5 కోట్ల టన్నుల నుంచి 8 కోట్ల టన్నులకు పెంచుకునే దిశగా శ్రీ సిమెంట్ అడుగులు వేస్తోంది. ఈ కంపెనీలకు చెందిన కొత్త ఉత్పత్తి సామర్థ్యాలు అందుబాటులోకి వస్తే వచ్చే రెండు, మూడేళ్లలో ధరల యుద్ధం మొదలయ్యే అవకాశం ఉందని.. ఈ పరిణామం ధరలపై ఒత్తిడిని తీసుకువస్తుందని అంచనా వేస్తున్నట్లు హైదరాబాద్కు చెందిన సిమెంట్ కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.
వచ్చే ఐదేళ్లలో కొత్తగా అందుబాటులోకి వచ్చే సామర్థ్యాల లో దాదాపు 70 శాతం సామర్థ్యాలు దిగ్గజ కంపెనీలకు చెందినవేనని.. ఇది చిన్న కంపెనీలపై ఒత్తిడిని పెంచుతాయని విశ్లేషిస్తున్నారు. సామర్థ్య వినియోగాన్ని దాదాపు 65 శాతంగా పరిగణనలోకి తీసుకుంటే.. వచ్చే రెండేళ్లకు అందుబాటులోకి వచ్చే కొత్త సామర్థ్యాలు పెరిగే గిరాకీకి సరిపోతుంది. అయితే.. ఆ తర్వాత పెంచే సామర్థ్యాల వల్ల గిరాకీ కంటే ఉత్పత్తి అధికంగా ఉండే ప్రమాదం ఉందని అంటున్నారు.