‘గ్రో’లో సత్య నాదెళ్ల పెట్టుబడి
ABN , First Publish Date - 2022-01-09T08:30:32+05:30 IST
మ్యూచువల్ ఫండ్, స్టాక్ ఇన్వె్స్టమెంట్ ప్లాట్ఫామ్ ‘గ్రో’లో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల పెట్టుబడి పెట్టారు. కంపెనీలో పెట్టుబడిదారుగానే కాకుండా సలహాదారుగా కూడా ఆయన..
సలహాదారుగానూ వ్యవహరించనున్న మైక్రోసాఫ్ట్ సీఈఓ
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్, స్టాక్ ఇన్వె్స్టమెంట్ ప్లాట్ఫామ్ ‘గ్రో’లో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల పెట్టుబడి పెట్టారు. కంపెనీలో పెట్టుబడిదారుగానే కాకుండా సలహాదారుగా కూడా ఆయన వ్యవహరించనున్నట్టు శనివారం గ్రో ప్రకటించింది. అయితే నాదెళ్ల ఎంత మొత్తం పెట్టుబడిగా పెట్టారన్న వివరాలు వెల్లడికావాల్సి ఉంది. ప్రపంచంలోని అత్యుత్తమ సీఈఓల్లో ఒకరిని ఇన్వెస్టర్, సలహాదారుగా గ్రో పొందిందని, భారత్లో ఆర్థిక సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే తమ ఆశయంలో సత్య నాదెళ్ల చేరడం సంతోషంగా ఉందని గ్రో సీఈఓ లలిత్ కేశ్రే ట్వీట్ చేశారు. గ్రో ఇన్వెస్టర్ల నుంచి పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తోంది. గత ఏడాది రెండు విడతల్లో నిధులను కంపెనీ సమీకరించింది. మొదట ఏప్రిల్లో 8.3 కోట్ల డాలర్ల నిధులను సమీకరించినప్పుడు కంపెనీ విలువ 100 కోట్ల డాలర్లకు పైగా ఉంది. అక్టోబరులో మరోసారి 25.1 కోట్ల డాలర్ల (రూ.1,885 కోట్లు) నిధులను సమీకరించినప్పుడు వాల్యుయేషన్ 300 కోట్ల డాలర్లుగా లెక్కకట్టారు. కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోవడం, ఆరోగ్యపరమైన ఆందోళనలతో ప్రజల ఆలోచన ధోరణిలో మార్పులు చోటు చేసుకున్నాయి. పెట్టుబడులు పెట్టడం, పొదుపుపై దృష్టిసారించే వారి సంఖ్య పెరిగింది. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కంపెనీల తొలి పబ్లిక్ ఇష్యూల్లోనూ పెట్టుబడులు పెట్టడానికి రిటైల్ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటివి గ్రో వంటి కంపెనీల వినియోగదారులు పెరిగేందుకు దోహదపడుతున్నాయి.
ఇక గ్రో తన వ్యాపార వృద్ధి మూలంగా ప్రపంచ ఇన్వెస్టర్లను ఆకర్షించగలుగుతోంది. తాజాగా ఈ జాబితాలో సత్య నాదెళ్ల చేరారు. ఫ్లిప్కార్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్లైన లలిత్ కేశ్రే, హర్ష్ జైన్, నీరజ్ సింగ్, ఇషాన్ బన్సాల్ 2016లో గ్రో ప్లాట్ఫామ్ను స్థాపించారు. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ఐపీఓలు, యూఎస్ స్టాక్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్, బంగారం వంటి వాటిలో యూజర్లు పెట్టుబడులు పెట్టేందుకు ఇది సహాయపడుతోంది. తన ప్లాట్ఫామ్ వినియోగదారుల సంఖ్య రెండు కోట్లకు పైగా ఉన్నట్టు కంపెనీ చెబుతోంది.