హైదరాబాద్లో నూతన ఓపెన్ బ్లూ ఇన్నోవేషన్ సెంటర్ను ప్రారంభించిన జాన్సన్ కంట్రోల్స్
ABN , First Publish Date - 2022-06-15T01:01:21+05:30 IST
స్మార్ట్, హెల్దీ, సస్టెయినబల్ బిల్డింగ్స్ రంగంలో అంతర్జాతీయంగా అగ్రగామిగా వెలుగొందుతున్న జాన్సన్ కంట్రోల్స్
హైదరాబాద్: స్మార్ట్, హెల్దీ, సస్టెయినబల్ బిల్డింగ్స్ రంగంలో అంతర్జాతీయంగా అగ్రగామిగా వెలుగొందుతున్న జాన్సన్ కంట్రోల్స్ హైదరాబాద్లో నేడు తమ నూతన ఓపెన్ బ్లూ ఇన్నోవేషన్ కేంద్రాన్ని ప్రారంభించింది. మంత్రి కేటీఆర్ దీనిని ప్రారంభించారు. జాన్సన్ కంట్రోల్స్ గ్లోబల్ సెక్యూరిటీ ప్రొడక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ అండ్ జనరల్ మేనేజర్ డేవ్ పుల్లింగ్, జాన్సన్ కంట్రోల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ గ్లోబల్ వీపీ గోపాల్ పారిపల్లి, జాన్సన్ కంట్రోల్స్ ఇంట్రూజన్ ప్రొడక్ట్స్ గ్లోబల్ ఇంజినీరింగ్ వైస్ ప్రెసిడెంట్ తజ్మిన్ పిరానీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. జాన్సన్ కంట్రోల్స్తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం, ఈ కేంద్రం ఏర్పాటులో తమ వంతు పాత్ర ఉన్నందుకు గర్వంగా ఉన్నట్టు చెప్పారు.
ఈ ఓపెన్ బ్లూ ఇన్నోవేషన్ కేంద్రం ప్రధానంగా సెక్యూరిటీ ఉత్పత్తుల పరిశోధన, అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తుంది. ఇంటిలిజెంట్ ఎడ్జ్ ఉపకరణాలు వినియోగించి వినియోగదారుల అనుభవాలను సమూలంగా మార్చేందుకు ఉపయోగపడుతుంది. ఆ సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ విజయ్ శంకరన్ మాట్లాడుతూ.. హైదరాబాద్లో నూతన ఆవిష్కరణలు ప్రపంచవ్యాప్తంగా తమ సంస్థకు ఉన్న ఇన్నోవేషన్ కేంద్రాలకు అనుగుణంగా ఉంటుందన్నారు. ఈ నూతన ఓపెన్ బ్లూ ఇన్నోవేషన్ సెంటర్ కోసం ఎసెంచర్తో జాన్సన్ కంట్రోల్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్ట్లో ఎసెంచర్ అత్యంత కీలకమైన పాత్ర పోషించనుంది. ఈ ఓపెన్ బ్లూ ఇన్నోవేషన్ కేంద్రం 500 మంది ఇంజినీర్లతో తమ కార్యకలాపాలు ప్రారంభించింది. రాబోయే రెండేళ్లలో అదనంగా మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయి. భారతదేశానికి స్మార్ట్, హెల్దీ, సస్టెయినబుల్ బిల్డింగ్స్ కోసం అత్యున్నత శ్రేణి పరిష్కారాలను అందించాలనే జాన్సన్ కంట్రోల్స్ నిబద్ధతను ఈ సెంటర్ సాక్షీభూతంగా నిలుస్తుందని డేవ్ పుల్లింగ్ అన్నారు.