భారత అంతర్జాతీయ వాణిజ్య లక్ష్యం 2030 నాటికి 160 లక్షల కోట్లు
ABN , First Publish Date - 2022-09-08T06:59:42+05:30 IST
భారత వస్తు, సేవల ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో 67,500 కోట్ల డాలర్లకు చేరుకున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
శాన్ఫ్రాన్సిస్కో(అమెరికా): భారత వస్తు, సేవల ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో 67,500 కోట్ల డాలర్లకు చేరుకున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. 2030 నాటికి అంతర్జాతీయ వాణిజ్యాన్ని 2 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.160 లక్షల కోట్లు) స్థాయికి పెంచాలని భారత్ ఆశిస్తోందన్నారు. అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులతో ముచ్చటించిన సందర్భంగా మంత్రి ఈ విషయాన్ని ప్రస్తావించారు. అంతేకాదు, వందేళ్ల స్వాతంత్య్ర ఉత్సవాలు నిర్వహించుకునే సమయానికి భారత్ 30 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగనుందన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలన్నీ సత్ఫలితాలిస్తే 2047 నాటికి భారత్ 35-45 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదిగేందుకూ అవకాశాల్లేకపోలేవన్నారు. ప్రస్తుతం 3.3 లక్షల కోట్ల డాలర్ల జీడీపీతో భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది.