సంపద సృష్టిలో కంపెనీల హవా
ABN , First Publish Date - 2022-12-09T01:26:41+05:30 IST
ఆర్థిక ఆటుపోట్లు ఎలా ఉన్నా.. సంపద సృష్టిలో కొన్ని కంపెనీలు దూసుకుపోతున్నాయి. దీంతో వాటి ప్రమోటర్లు, వాటాదారుల సంపద చుక్కలంటుతోంది...
టాప్-100 కంపెనీల వాటా రూ.92.2 లక్షల కోట్లు
ముందున్న అంబానీ, అదానీ కంపెనీలు
ముంబై: ఆర్థిక ఆటుపోట్లు ఎలా ఉన్నా.. సంపద సృష్టిలో కొన్ని కంపెనీలు దూసుకుపోతున్నాయి. దీంతో వాటి ప్రమోటర్లు, వాటాదారుల సంపద చుక్కలంటుతోంది. గత ఐదేళ్లలో (2017-22) దేశంలోని వంద ప్రముఖ కంపెనీలు కొత్తగా రూ.92.2 లక్షల కోట్ల సంపద సృష్టించాయి. గతంలో ఎన్నడూ దేశంలోని టాప్-100 కంపెనీలు ఐదేళ్లలో ఈ స్థాయి సంపదను సృష్టించలేదని ప్రముఖ బ్రోకరేజీ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ తన ‘యాన్యువల్ వెల్త్ క్రియేషన్ స్టడీ’ నివేదికలో పేర్కొంది. గత ఐదేళ్లలో అత్యధిక సంపద సృష్టించిన కంపెనీగా ముకేశ్ అంబానీ నాయకత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) మరోసారి చరిత్ర సృష్టించింది. సంపద సృష్టిలో ఆర్ఐఎల్ ముందున్నా ప్రపంచ కుబేరుల జాబితాలో ముకేశ్ అంబానీ 9,230 కోట్ల డాలర్ల సంపదతో ఎనిమిదో స్థానానికి పడిపోవడం విశేషం.
అదానీ కంపెనీల జోరు: సంపద సృష్టిలో గౌతమ్ అదానీ నిర్వహణలోని కంపెనీల హవా కొనసాగుతోంది. ఈ విషయంలో అదానీ ట్రాన్స్మిషన్.. ఆర్ఐఎల్ను మించిపోయింది. ఈ కంపెనీ షేరు గత ఐదేళ్లలో ఏటా సగటున 106 శాతం చొప్పున పెరిగింది. మరోవైపు అదానీ గ్రూప్నకు చెందిన అదానీ ఎంటర్ప్రైజెస్ కంపెనీ షేరు గత ఐదేళ్లలో ఏటా 97 శాతం చొప్పున ఇన్వెస్టర్లకు లాభాలు పంచాయని మోతీలాల్ ఓస్వాల్ తెలిపింది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు చూసినా ఈ రెండు అదానీ కంపెనీలే ఇన్వెస్టర్లకు అత్యధిక సంపద సృష్టించాయి. కొత్త వ్యాపారాలు, విస్తరణతో ఈ ఏడాది అదానీ గ్రూప్ కంపెనీలు షేర్లు చుక్కలంటాయి.
టెక్నాలజీ కంపెనీల ముందంజ: సంపద సృష్టిలో మిగతా రంగాలతో పోలిస్తే టెక్నాలజీ కంపెనీలు ముందున్నాయి. ఆర్థిక సేవల రంగం తర్వాతి స్థానంలో ఉంది. సమీప భవిష్యత్లోనూ ఈ రెండు రంగాల హవా కొనసాగుతుందని మోతీలాల్ ఓస్వాల్ తెలిపింది. గత ఐదేళ్లలో అత్యధిక పసంపద సృష్టించిన టాప్-5 కంపెనీల జాబితాలో టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్డీఎ్ఫసీ బ్యాంక్ కూడా ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రం ఈ విషయంలో పూర్తిగా వెనకబడ్డాయి. నిజానికి గత ఐదేళ్లలో పీఎ్సయూల షేర్ల మార్కెట్ విలువ రూ.14 లక్షల కోట్లు తుడిచిపెట్టుకు పోయింది.