Banks: దేశంలో బ్యాంకుల వాస్తవిక స్థితి ఇదీ.. గత ఐదేళ్లలో రుణమాఫీ ఎంతంటే..

ABN , First Publish Date - 2022-11-21T18:03:35+05:30 IST

దేశంలో బ్యాంకుల (banks) వాస్తవిక పరిస్థితిని ప్రతిబింబించే కీలకమైన ఓ రిపోర్ట్ వెలుగుచూసింది. దేశంలోని బ్యాంకులు గత ఐదేళ్లలో ఏకంగా...

Banks: దేశంలో బ్యాంకుల వాస్తవిక స్థితి ఇదీ.. గత ఐదేళ్లలో రుణమాఫీ ఎంతంటే..

ముంబై: దేశంలో బ్యాంకుల (banks) వాస్తవిక పరిస్థితిని ప్రతిబింబించే కీలకమైన ఓ రిపోర్ట్ వెలుగుచూసింది. దేశంలోని బ్యాంకులు గత ఐదేళ్లలో ఏకంగా రూ.10 లక్షల కోట్ల మొండి బకాయిలను (bad loans) మాఫీ (written off) చేశాయి. రూ.10,09,510 కోట్లు (123.86 బిలియన్ డాలర్లు) మేర రద్దు చేయడం బ్యాంకుల ఎన్‌పీఏలు (NPAs) తగ్గుదలకు కారణమైంది. ఇక ఇచ్చిన రుణాల్లో 13 శాతం మాత్రమే బ్యాంకులు రికవరీ చేశాయి. అంటే రూ.1,32,036 కోట్లు రికవరీ చేసినట్టు ఆర్బీఐ (RBI) వెల్లడించింది. ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ‘ ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సమాచారం కోరగా ఈ మేరకు ఆర్బీఐ వివరాలు పంచుకుంది.

గత పదేళ్లలో బ్యాంకుల నిరర్ధక ఆస్తుల తగ్గుదలకు రుణ మాఫీనే కారణమని ఆర్బీఐ విశ్లేషించింది. ఈ మేరకు బ్యాంకుల నుంచి సమాచారాన్ని క్రోడీకరించినట్టు వివరించింది. ప్రభుత్వరంగ బ్యాంకులే అత్యధికంగా రుణమాఫీ చేశాయి. రూ.7,34,738 కోట్లను ప్రభుత్వరంగ బ్యాంకులు రద్దు చేయగా.. ఏ బ్యాంకు ఎంతమేర మాఫీ చేసిందనే విషయాన్ని తెలపలేదు. ఈ తరహా సమాచారం తమవద్దలేదని వివరించింది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. బ్యాంకులు చిన్నా, పెద్ద రుణాలను మాఫీ చేసినప్పటికీ రుణగ్రహీతల వ్యక్తిగత వివరాలను మాత్రం వెల్లడించకపోవడం గమనార్హం. కాగా గత ఐదేళ్లకు సంబంధించి ఎస్‌బీఐ రూ.2,04,486 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.67,214 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.66,711 కోట్ల మేర రద్దు చేశాయి. కాగా మూడు నెలలకుపైగా రుణం చెల్లించకపోతే ఆ లోన్‌ను నిరర్ధక ఆస్తిగా (NPA) బ్యాంకులు ప్రకటిస్తాయి.

Updated Date - 2022-11-21T19:08:46+05:30 IST