బాబోయ్...ధరలు భగ్గు
ABN , First Publish Date - 2022-05-18T07:06:33+05:30 IST
దేశంలో వస్తు, సేవల ధరలు మండిపోతున్నాయి. హోల్సేల్ మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి. ఏప్రిల్ నెల టోకు ద్రవ్యోల్బణమే ఇందుకు ఉదాహరణ.
ఏప్రిల్ టోకు ద్రవ్యోల్బణం 15.08 శాతం
13 నెలల గరిష్ఠం
న్యూఢిల్లీ: దేశంలో వస్తు, సేవల ధరలు మండిపోతున్నాయి. హోల్సేల్ మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి. ఏప్రిల్ నెల టోకు ద్రవ్యోల్బణమే ఇందుకు ఉదాహరణ. ఈ నెలలో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం గత తొమ్మిదేళ్లలో ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయి 15.08 శాతంగా నమోదైంది. ఈ ఏడాది మార్చితో పోల్చినా ఇది 0.58 శాతం ఎక్కు వ. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే మాత్రం 4.34 శాతం ఎక్కువ. గత 13 నెలలుగా టోకు ద్రవ్యోల్బణం వరుసపెట్టి కోరలు చాస్తోంది. ఏప్రిల్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం ఇప్పటికే 7.79 శాతంతో ఎనిమిదేళ్ల గరిష్ఠ స్థాయికి చేరింది.
ఎందుకంటే ?
మార్చి నెలతో పోలిస్తే గత నెల అన్ని వస్తువుల ధరల సూచీ 2.1 శాతం పెరిగింది. ఇంధన ధరల సూచీ అయితే 2.8 శాతం పెరిగింది. టోకు ధరల సూచీలో 64.23 శాతం వాటా ఉన్న తయారీ వస్తువుల సూచీ కూడా 1.7 శాతం పెరుగుదల నమోదు చేసింది. ఆహారోత్పత్తుల ధరల సూచీ అయితే ఏకం గా 3.4 శాతం పెరిగింది. ‘వేసవి ఎండలతో టీ పొడితో పాటు కూరగాయలు, పండ్లు, పాల ధరలు పెరగడం ఇందుకు ప్రధాన కారణం’ అని ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త అదితి నాయర్ చెప్పారు.
వడ్డీపోటు తప్పదు
టోకు, రిటైల్ ద్రవ్యోల్బణాల సెగతో దేశంలో వడ్డీ రేట్లు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ద్రవ్యోల్బణానికి చెక్ పెట్టే యోచనతో ఆర్బీఐ ఇప్పటికే రెపో రేటు 0.4 శాతం పెంచింది. జూన్, ఆగస్టు భేటీల్లో మరో ముప్పావు శాతం పెంచుతుందని మార్కెట్ వర్గాల అంచనా. ఇదే జరిగితే జీడీపీ వృద్ధిరేటు అంచనాలు సైతం బెడిసి కొట్టే ప్రమాదం ఉంది. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఇప్పటికే భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాల్ని 8.5 శాతం నుంచి 7.5 శాతానికి కుదించేశాయి. వడ్డీరేట్ల భారంతో ఇపుడిపుడే కోలుకుంటున్న రియల్టీ, ఆటో వంటి కీలక రంగాలు మళ్లీ నీరసించే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.