అదానీ, అంబానీకి బిగ్‌ బూస్ట్‌

ABN , First Publish Date - 2022-02-02T08:32:21+05:30 IST

బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేసింది. ఈ దిశగా చేపట్టిన చర్యల్లో భాగంగా డేటా సెంటర్లు, ఎనర్జీ స్టోరేజీతో పాటు ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ ఇన్‌ఫ్రా, గ్రిడ్‌ స్కేల్‌....

అదానీ, అంబానీకి బిగ్‌ బూస్ట్‌

డేటా సెంటర్లు, ఎనర్జీ స్టోరేజీ  సదుపాయాలకు మౌలిక హోదా

వీటి ఏర్పాటుకు బడా కార్పొరేట్లకు ఇక కారు చౌకగా రుణాలు 


న్యూఢిల్లీ: బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేసింది. ఈ దిశగా చేపట్టిన చర్యల్లో భాగంగా డేటా సెంటర్లు, ఎనర్జీ స్టోరేజీతో పాటు ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌  ఇన్‌ఫ్రా, గ్రిడ్‌ స్కేల్‌ బ్యాటరీ సిస్టమ్స్‌ వంటి ఆధునిక సదుపాయాలకు సైతం మౌలిక హోదా కల్పిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్లో ప్రకటించారు. దీంతో ఈ సదుపాయాల ఏర్పాటుకు బ్యాంకుల నుంచి కారు చౌకగా రుణాలు లభిస్తాయి. కాబట్టి, ఈ నిర్ణయం ముకేశ్‌ అంబానీ, గౌతమ్‌ అదానీ, సునీల్‌ మిట్టల్‌ వంటి కార్పొరేట్‌ దిగ్గజాలకు భారీగా లబ్ది చేకూర్చనుందని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే, ఈ విభాగాల్లో అదానీ, మిట్టల్‌, అంబానీలు ఇప్పటికే భారీ ప్రణాళికలు ప్రకటించారు. 


విదేశీ రుణాల సేకరణ, తక్కువ వడ్డీకే దీర్ఘకాలిక రుణాల సేకరణతో పాటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను సైతం ఆకర్షించేందుకు డేటా సెంటర్లకు ఇన్‌ఫ్రా హోదా దోహదపడనుందని హైదరాబాద్‌కు చెందిన డేటా సెంటర్ల నిర్వహణ సంస్థ కంట్రోల్‌ఎస్‌ వ్యవస్థాపకులు, సీఈఓ శ్రీధర్‌ పిన్నపురెడ్డి అన్నారు. డిజిటల్‌ యూనివర్సిటీలు, డిజిటల్‌ బ్యాంక్‌లు, డిజిటల్‌ రుపీ ప్రవేశంతో పాటు శరవేగంగా పెరుగుతున్న డిజిటల్‌ చెల్లింపులు, భారత్‌నెట్‌ ద్వారా మారుమూల ప్రాంతాల వరకు ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటుతో భవిష్యత్‌లో గిగావాట్ల కొద్దీ డిజిటల్‌ సమాచారం పుట్టుకురానుందని, ఆ డేటాను దేశీయంగా నిక్షిప్తం చేసేందుకు పెద్దఎత్తున డేటా సెంటర్లు అవసరం అవుతాయమని ఆయన పేర్కొన్నారు. పూర్తిగా పునరుత్పాదక ఇంధన శక్తి ఆధారంగా నడిచే గ్రీన్‌ డేటా స్టోరేజీ సెంటర్ల ఏర్పాటులో తమ గ్రూప్‌ ప్రపంచ దిగ్గజంగా ఎదగాలనుకుంటున్నట్లు దేశంలో రెండో అత్యంత ధనవంతుడైన గౌతమ్‌ అదానీ గత ఏడాది నవంబరులో ప్రకటించారు. 


అదానీ గ్రూప్‌ తొలుత ముంబై, చెన్నై, హైదరాబాద్‌, ఢిల్లీలో డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలనుకుంటోంది. సునీల్‌ మిట్టల్‌కు చెందిన టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ సైతం కూడా డేటా సెంటర్ల ఏర్పాటులో భారీ ప్రణాళికలను రూపొందించుకుంది. 2025 నాటికి గ్రూప్‌ డేటా సెంటర్ల సామర్థ్యాన్ని మూడింతలకు పెంచేందుకు రూ.5,000 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు తెలిపింది. ముకేశ్‌ అంబానీకి చెందిన డిజిటల్‌ సేవల విభాగమైన జియో ప్లాట్‌ఫామ్‌ కూడా డేటా సెంటర్ల ఏర్పాటుపై దృష్టిసారించింది. అంతేకాదు, గత ఏడాది ద్వితీయార్ధంలో ప్రకటించిన 7,600 కోట్ల డాలర్ల భారీ పెట్టుబడి ప్రణాళికలో భాగంగా గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రియలన్స్‌ ఎనర్జీ స్టోరేజీ సహా నాలుగు గిగా ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయబోతోంది. వీటికయ్యే భారీ పెట్టుబడుల కోసం చౌకగా రుణాలు పొందేందుకు మౌలిక హోదా దోహదపడనుంది. 

Updated Date - 2022-02-02T08:32:21+05:30 IST