రాజ్యసభ సభ్యులుగా YCP నుంచి నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవం
ABN , First Publish Date - 2022-06-04T01:48:15+05:30 IST
ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. రాజ్యసభ సభ్యులుగా వైసీపీ నుంచి నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు.

అమరావతి: ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. రాజ్యసభ సభ్యులుగా వైసీపీ నుంచి నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. విజయసాయి, నిరంజన్రెడ్డి, ఆర్.కృష్ణయ్య, బీద మస్తాన్రావు ఏకగ్రీవమయ్యారు. వైసీపీ ఎంపిక చేసిన రాజ్యసభ సభ్యుల్లో ఇద్దరు అచ్చంగా తెలంగాణకు చెందిన వారు కావడం విశేషం. ఆర్.కృష్ణయ్యది వికారాబాద్ జిల్లా. తెలంగాణకు చెందిన నిరంజన్ రెడ్డి సీఎం జగన్కు వ్యక్తిగత న్యాయవాది. జగన్పై ఉన్న అక్రమాస్తుల కేసులను ఆయన వాదిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనను ఏపీలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా నియమించారు. ఇక విజయసాయి రెడ్డి జగన్ కుటుంబ కంపెనీల ఆడిటర్గా దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన ఇప్పటికే రాజ్యసభ సభ్యుడు. వచ్చేనెలలో ఆయన పదవీకాలం ముగియనుంది. ఇప్పుడు.. జగన్ ఆయనకు మరో అవకాశమిచ్చారు. ఇప్పుడు ఎంపిక చేసిన నలుగురు అభ్యర్థుల్లో... బీద మస్తాన్ రావు, విజయ సాయిరెడ్డి ఇద్దరూ నెల్లూరు జిల్లాకు చెందిన వారే కావడం విశేషం.