సీపీఎస్ రద్దుపై ఆందోళన తీవ్రతరం
ABN , First Publish Date - 2022-08-17T10:15:44+05:30 IST
సీపీఎస్ ఉద్యోగులు ఉద్యమాన్ని తీవ్రతరం చేయనున్నారు.
(అమరావతి-ఆంధ్రజ్యోతి): సీపీఎస్ ఉద్యోగులు ఉద్యమాన్ని తీవ్రతరం చేయనున్నారు. సీపీఎస్ రద్దు చేస్తామంటూ ఇచ్చిన మాటపై జగన్ సర్కార్ మడమ తిప్పేయడంతో రెండు సంఘాలు ఉద్యమ కార్యాచరణ చేపట్టాయి. సీపీఎస్ విధానాన్ని అమలులోకి తెచ్చిన సెప్టెంబరు 1వ తేదీని పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ రెండు సంఘాలు వేరు వేరుగా ఆందోళనలకు సన్నాహాలు చేస్తున్నాయి. ఏపీసీపీఎస్ ఉద్యోగుల సంఘం సీఎం జగన్ ఇల్లు ముట్టడికి పిలుపు ఇవ్వగా... సీపీఎస్ రద్దుపై పోరాటం చేస్తున్న మరో ఉద్యోగుల సంఘం ఏపీసీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అదే రోజు విజయవాడలో మిలీనియం మార్చ్కు పిలుపునిచ్చింది. దీంతో ప్రభుత్వ పెద్దలు కూడా ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరిలో ప్రభుత్వం ఐఆర్ కన్నా తక్కువగా పీఆర్సీ ప్రకటించడానికి నిరసనగా విజయవాడ బీఆర్టీ రోడ్డులో జరిగిన సభకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున తరలివచ్చారు. వారిని కట్టడి చేయాలని ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించి విఫలమైంది. మళ్లీ ఇప్పుడు సీపీఎ్సపై కూడా ఆ స్థాయిలో నిరసన వ్యక్తమవుతుందేమో? అనే అందోళన ప్రభుత్వంలో మొదలైనట్లు తెలుస్తోంది.