పేదలకేం చేశామో.. చర్చిద్దాం రా..

ABN , First Publish Date - 2022-12-31T03:14:04+05:30 IST

నెల్లూరు/కోవూరు, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): పేదలకు ఎవరు ఏం చేసిందీ తేల్చేందుకు చర్చకు రావాలని సీఎం జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్‌ విసిరారు. ‘పేదలకేం చేశావని నర్సీపట్నం సభలో జగన్‌ మాట్లాడారు.

 పేదలకేం చేశామో.. చర్చిద్దాం రా..

భయంతోనే బూతులు!.. నా సభలకు వస్తున్న ప్రజలను చూసే!!

పదే పదే వయసు గురించి మాట్లాడుతున్నారు

నా వయసువారు చాలా మంది ముఖ్యమంత్రులుగా ఉన్నారు

మోదీది కూడా నా వయసే.. మా వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది

నీలాంటి సైకోలతోనే ప్రమాదం.. రాష్ట్రంలో ఎవరూ ఆనందంగా లేరు

అందరిలోనూ అశాంతి.. మనుషులుగానే చూడడం లేదు

పింఛన్లపై సీఎం అబద్ధాలు: చంద్రబాబు.. కోవూరులో భారీ సభ

జగన్‌రెడ్డీ చర్చకు నువ్వు సిద్ధమా.. బాబు సవాల్‌

నెల్లూరు/కోవూరు, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): పేదలకు ఎవరు ఏం చేసిందీ తేల్చేందుకు చర్చకు రావాలని సీఎం జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్‌ విసిరారు. ‘పేదలకేం చేశావని నర్సీపట్నం సభలో జగన్‌ మాట్లాడారు. కోవూరు సభ నుంచి ఆయనకు సవాల్‌ విసురుతున్నా. పేదలకు ఎవరేం చేశారో చర్చిద్దాం. ఎస్సీలకు, మైనారిటీలకు, బీసీలకు ఏ పార్టీ ఏం చేసిందో.. రైతుల అభ్యున్నతికి ఏ పార్టీ కృషి చేసిందో.. చర్చకు నేను సిద్ధం. ఈ కోవూరులోనే ప్రజల మధ్యలోనే చర్చిద్దాం. ఈ ప్రజలే నీ బట్టలు ఊడగొట్టేస్తారు. చర్చకు వచ్చే దమ్ము నీకుందా జగన్‌’ అని చంద్రబాబు నిలదీశారు. జగన్‌ ప్రభుత్వానివి బూటకపు సంక్షేమ పథకాలన్న విషయాన్ని ప్రజలు గ్రహించారని అన్నారు. వైసీపీ బాదుడు, పీకుడు కార్యక్రమాలతో విసిగిపోయారని చెప్పారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో తాను చేపట్టిన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమానికి బ్రహ్మరథం పడుతున్నారని.. తన సభలకు వస్తున్న జనాన్ని చూసి భయపడి బూతులు తిట్టడం మొదలుపెట్టారని ధ్వజమెత్తారు. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరులో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆనందంగా లేరని అన్నారు. ‘మీరు సంతోషంగా ఉన్నారా చెప్పండి.. నేను మీటింగ్‌ కేన్సిల్‌ చేసుకుని వెళ్లిపోతా’ అని అడిగారు. దీంతో ప్రజలు లేదు.. లేదు.. వద్దు.. వద్దు అంటూ నినాదాలు చేశారు. అందరిలో అశాంతి ఉందని.. ఎందుకుందో ఈ సీఎం వాస్తవాలు తెలుసుకోడని చంద్రబాబు ఆక్షేపించారు. ‘అసలు మనల్ని మనుషులుగానే చూడడం లేదు. బానిసలుగా చూస్తున్నాడు. ఇంకా ఏమన్నారంటే...

మోదీ కూడా నా వయసువారే!

పదే పదే నా వయసు గురించి జగన్‌ మాట్లాడుతున్నారు. దేశంలో నా వయసు ఉన్న చాలా మంది ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ప్రధాని మోదీ కూడా నా వయసువారే. మా వల్ల ప్రజలకు ప్రమాదం లేదు. మా అనుభవం వల్ల వారికి మేలు జరుగుతుంది. నీలాంటి సైకోలు సీఎంలైతేనే ప్రమాదం. నేను 14 ఏళ్లు ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఏనాడైనా ప్రజలను ఇబ్బంది పెట్టానా!? ఈ సైకో పాలనలో ప్రతి ఒక్కరూ భయపడే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలోని అరాచక పరిస్థితులను చూసి ప్రజల రక్షణ కోసం ప్రతిపక్షాలన్నీ ఒక్కటై ప్రజాహక్కుల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేశాయంటే నీకు సిగ్గుందా జగన్‌రెడ్డీ! నువ్వేం డిక్టేటర్‌ కాదు. నీ ఇష్టప్రకారం చేయడానికి కుదరదు.

నవ మోసాలను జనం గుర్తించారు

జగన్‌ పథకాలు నవరత్నాలు కావు.. నవ మోసాలని ప్రజలు గుర్తించారు. తొలుత ఎన్టీఆర్‌ అప్పటి పరిస్థితుల ఆధారంగా రూ.35 పింఛను ఇచ్చారు. నేను రూ.75 చేశాను. రాజశేఖర్‌రెడ్డి దానిని రూ.200 చేశాడు. ఆ తర్వాత నేను 2 వేలు చేశాను. మళ్లీ ముఖ్యమంత్రి అయి ఉంటే 3 వేలు ఇచ్చి ఉండేవాడిని. ఈ జగన్‌ మూడు వేలు పింఛను ఇస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చాడు. కానీ ఇవ్వకుండా మోసం చేశాడు. నేను 55 లక్షల మందికి పింఛన్లు ఇస్తే 39 లక్షల మందికే ఇచ్చినట్లు అబద్ధాలు చెబుతున్నాడు. ఉన్న ఫించన్లు ఊడబెరికేస్తున్నాడు. నీ మోసాన్ని ప్రజలు గమనించారు. జనంలోకి రా.. పింఛన్లు పీకేస్తున్నందుకు జనం నీ బట్టలు ఊడపీకడానికి సిద్ధంగా ఉన్నారు.

సమయం లేదు మిత్రమా...!

ఒక సైకో భస్మాసరుడిలా వచ్చాడు. మీరు శివుడిలా మోసపోయారు. ఒక వరం ఇచ్చారు. ఇప్పుడు వరమిచ్చిన ప్రజల నెత్తిన చేతులు పెడుతున్నాడు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలా లేదా..!?మీరు సిద్ధంగా ఉన్నారా లేదా..!? సమయం లేదు మిత్రమా...! ఉపేక్షిస్తే రాష్ట్రం సర్వనాశనమైపోతుంది.. ఏ వర్గమూ ఆనందంగా లేదు. రైతు నడ్డి విరిచేస్తున్నారు. పంటకు గిట్టుబాటు ధర లేదు. దళారులు దోచేస్తున్నారు. అందుకు నెల్లూరు జిల్లానే ఉదాహరణ. వ్యవసాయానికి ఖర్చు పెరిగింది. ఆదాయం తగ్గింది. వచ్చే కాస్త ఆదాయాన్నీ వైసీపీ దళారులు దోచేస్తున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా దళారుల నుంచి భాగాలు పంచుకుంటున్నారు. ఏమిటీ దౌర్భాగ్యం? యానాదులు అమాయకులు. వారికి జగన్‌ ఒక్క రూపాయైునా ఇచ్చారా? టీడీపీ అధికారంలోకి రాగానే ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తా.

నువ్వూ సిద్ధమా జగన్‌రెడ్డీ.. భయంతోనే బూతులు!

రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి నేను జనంలోకి వస్తే.. వారి స్పందన చూసి భరించలేక వైసీపీ నాయకులు తిట్ల పురాణం అందుకున్నారు. నేను బాంబులకే భయపడలేదు.. మీ బూతులకు భయపడి రాష్ట్ర భవితను వదిలిపెడతానా! నేను అన్‌స్టాపబుల్‌.. టీడీపీ అన్‌స్టాపబుల్‌.

నాకు ఏ ఆశా లేదు. అధికారం కోసం కాదు.. తెలుగు జాతి అభ్యున్నతి కోసం.. దానిపై జరుగుతున్న విధ్వంసంపై పోరాడుతున్నా. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే అది ప్రజా విజయమే అవుతుంది.

బీసీలకు పైసా విదల్చకుండా కుర్చీలు, బెంచీలు లేని కార్పొరేషన్లు, ఫెడరేషన్‌ పదవులు ఇచ్చారు. ఏ బీసీకైనా జగన్‌ ఒక రూపాయి ఇచ్చాడా? 5 కులాలకు అరకొర ఇచ్చి బీసీలందరికీ న్యాయం చేశామంటే నమ్మాలా?

రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడం నూటికి నూరుపాళ్లు ఖాయం. జగన్‌కు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చి టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారు. - చంద్రబాబు

జగన్‌ ధనదాహానికి దగదర్తి విమానాశ్రయం రద్దు

దామవరంలో శిలాఫలకాన్ని పరిశీలించిన చంద్రబాబు

కావలి, డిసెంబరు 30: వైసీపీ అధికారంలోకి రాగానే జగన్మోహన్‌రెడ్డి డబ్బులకు కక్కుర్తిపడి బినామీలకు కట్టబెట్టేందుకు దామవరం (దగదర్తి) ఎయిర్‌పోర్టును రద్దు చేశాడని చంద్రబాబు ఆరోపించారు. దామవరంలో విమానాశ్ర యం నిర్మాణానికి గతంలో తాను ఆవిష్కరించిన శిలాఫలకాన్ని ఆయన శుక్రవారం పరిశీలించారు. కావలిని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో దామవరం వద్ద 1,395 ఎకరాల్లో రూ.365 కోట్లతో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు శ్రీకారం చుట్టామన్నా రు. జగన్‌ వచ్చాక దానిని రద్దు చేసి తె ట్టు వద్ద ప్రతిపాదనలు పెట్టారని.. అయి తే అక్కడ స్థలం అనుకూలం కాదని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ నివేదిక ఇచ్చిందని తెలిపారు. రామాయపట్నం, మచిలీపట్న ం పోర్టులు, రామాయపట్నం వద్ద రూ. 24 వేల కోట్ల కాగితాల పరిశ్రమను కూ డా జగన్‌ రద్దు చేశాడని మండి పడ్డారు. ఈ సైకో పోయి సైకిల్‌ వస్తే గానీ ఈ సమస్యలు పరిష్కారం కావన్నారు.

Updated Date - 2022-12-31T08:24:44+05:30 IST