CHANDRABABU: మేమే వస్తాం!.. మళ్లీ ఇస్తాం!
ABN , First Publish Date - 2022-12-10T01:36:23+05:30 IST
మళ్లీ అధికారంలోకి వస్తున్నాం. ఆ వెంటనే... వైసీపీ సర్కారు రద్దు చేసిన అన్ని సంక్షేమ పథకాలనూ పునరుద్ధరిస్తాం. వివిధ కారణాలు, సాకులతో పథకాలను దూరం చేసిన వారికి..
జగన్ రద్దు చేసిన అన్ని పథకాల పునరుద్ధరణ
కోత కోసిన పథకాల సొమ్ము వడ్డీతో సహా చెల్లింపు
జగన్ది భస్మాసుర హస్తం... పది ఇచ్చి వంద దోపిడీ మండలానికో అన్న క్యాంటీన్ పెడతాం
మైనారిటీలకు మళ్లీ ‘దుకాణ్... మకాన్’
విదేశీ విద్య... ఆంక్షలు లేని ‘దుల్హన్’
స్వర్ణకారుల ఆభరణాలకు మార్కెటింగ్
వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు అవసరమైతే చట్టం
చంద్రబాబు హామీలు... బాపట్లలో రోడ్షో
పొన్నూరులో మైనారిటీలతో ముఖాముఖి
గుంటూరు/బాపట్ల, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ‘‘మళ్లీ అధికారంలోకి వస్తున్నాం. ఆ వెంటనే... వైసీపీ సర్కారు రద్దు చేసిన అన్ని సంక్షేమ పథకాలనూ పునరుద్ధరిస్తాం. వివిధ కారణాలు, సాకులతో పథకాలను దూరం చేసిన వారికి... వడ్డీతో సహా ఆ డబ్బులు చెల్లిస్తాం’’ అని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా పొన్నూరులో శుక్రవారం మధ్యాహ్నం ‘బాత్చీత్ విత్ బాబు’ అనే పేరుతో ముస్లింలతో ఆయన చర్చాగోష్ఠి నిర్వహించారు. రాత్రి బాపట్లలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’లో భాగంగా రోడ్షోకు హాజరైన భారీ జన సందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ‘ప్రజలంతా పోరాడండి. చైతన్యంతో తిరగబడండి. సంక్షేమ పథకాలు తీసివేసినా, కేసులు పెట్టినా కోర్టుల్లో పోరాడదాం. పెన్షన్ తీసివేసినా, ఇంకేదైనా రాకపోయినా, అకారణంగా ఆపేసినా చంద్రన్న వస్తాడు... వడ్డీతో ‘‘జగన్ పది రూపాయలు ఇచ్చి వందరూపాయలు దోచుకుంటున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. మెడ మీద కత్తి పెట్టి ఆస్తులు రాయించుకునే మనస్తత్వం జగన్ది.. అలాంటి భస్మాసురుడికి ప్రజలు అధికారమనే వరమిచ్చారు. వారి నెత్తిన వాళ్లే భస్మాసుర హస్తం పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం తప్పు జరగనివ్వొద్దు!’’
- చంద్రబాబు
సహా ఇప్పిస్తాడని చెప్పండి’ అని పిలుపునిచ్చారు. మండలానికో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ‘జగన్ ఇక నీ పనైపోయింది. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా నీవు ఇంటికే’ అని చంద్రబాబు పేర్కొన్నారు. పోలవరం కోసం పడిన కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడున్నర ఏళ్లలో రోడ్లపై గోతులు తవ్వడం తప్ప ఈ ముఖ్యమంత్రి ఏంచేశారో చెప్పాలని నిలదీశారు. ‘‘ఈ రోడ్ల మీద ప్రయాణం చేస్తుంటే నా నడుము విరిగినంత పనైంది. అయినా సరే మీ కోసం బాధను భరించి పోరాడుతున్నాను’’ అని తెలిపారు. అమరావతికి నాడు జగన్ మద్దతు పలికినప్పుడు బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి అసెంబ్లీలో ఉన్నారని... ఇప్పుడు జగన్ మూడు రాజధానులు అంటుంటే పిల్లిలాగా ఉండిపోయారెందుకని ప్రశ్నించారు. ‘ఏ2’ ఎమ్మెల్యే కోన కలిసి 4000 ఎకరాల అటవీ భూమికి టెండర్ పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.
వానలో సైతం అపూర్వ స్వాగతం
తుఫాన్ హెచ్చరికలు, చలి వాతావరణం నేపథ్యంలో చంద్రబాబు రోడ్షోకు ప్రజలు ఎంతమేరకు వస్తారోనని టీడీపీ నాయకులు ఆందోళన చెందారు. కానీ... వర్షంలో సైతంచంద్రబాబుకు అపూర్వ స్వాగతం లభించింది. చుండూరుపల్లి, ఈతేరు, అప్పికట్ల, భర్తీపూడి, కొండ్రుబట్లవారిపాలెం దగ్గర జనం బారులు తీరి స్వాగతం పలికారు. తుఫాన్ కారణంగా శనివారం జరగాల్సిన చీరాల పర్యటనను చంద్రబాబు రద్దు చేసుకున్నారు.
మూడేళ్లుగా కష్టాలే.. మైనారిటీల వేదన
టీడీపీ పాలనలో తమకు అందిన పథకాలు, మూడున్నరేళ్ల వైసీపీలో పాలనలో పడుతున్న ఇబ్బందులను మైనారిటీలు వివరించారు. సంక్షేమం పూర్తిగా నిలిచిపోయిందని.. టీడీపీకి అండగా ఉన్నామని రేషన్ కార్డులు, పింఛన్లు తొలగించారని కన్నీటి పర్యంతమయ్యారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ... ‘‘వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం. వచ్చిన వెంటనే జగన్ నిలిపేసిన పథకాలన్నింటికీ వడ్డీతోపాటు లబ్ధిదారులకు చెల్లిస్తాం’’ అని భరోసా ఇచ్చారు. మైనారిటీలకు సంబంధించిన పథకాలన్నీ ఆంక్షల చట్రంలో ఇరుకున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘మంత్రి పదవికి.. సలహాదారులకు పదో తరగతి అర్హత అవసరం లేదంట. ముస్లిం మైనారిటీ పిల్లలకు దుల్హన్ పథకం కింద ఆర్థిక సాయం చేయాలంటే పదో తరగతి తప్పనిసరట. వేరే రాష్ట్రంలో వివాహం చేసుకుంటే సాయం అందించరట. 300 యూనిట్ల విద్యుత్ వాడకం చేసినా అనర్హులే! ఇదెక్కడి న్యాయం’’ అని మండిపడ్డారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ పరిరక్షణకు న్యాయ సాయం చేస్తామన్నారు. టీడీపీ అధికారంలో ఉండగా 10 లక్షల మందికి రంజాన్ తోఫా, సంక్రాంతి పండగ సందర్భంలో కానుకలు ఇచ్చామని గుర్తుచేశారు. ముస్లింలను ఆర్థికంగానే కాకుండా రాజకీయంగా పైకి తీసుకొస్తానని.. ఎన్నికల్లో గెలుస్తామని నమ్మకం ఉంటే ఎంతమందికైనా సీట్లు ఇస్తానని.. కేబినెట్లో తగిన ప్రాధాన్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్, ముస్లిం నాయకులు లాల్ వజీర్, నజీర్, సయ్యద్ రఫీ, ఫిరోజ్, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, మాజీ ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల, కొమ్మాలపాటి శ్రీధర్ పాల్గొన్నారు.
ముఖాముఖీ సాగిందిలా..
అబ్దుల్ ఖాదర్: ముస్లింలు ఎంతో మంది స్వర్ణకార వృత్తిలో ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఆభరణాలు దిగుమతి వల్ల ఇక్కడ ఉపాధి కోల్పోతున్నారు. మీరు అధికారంలోకి వస్తే ఏ విధంగా ఆదుకుంటారు?
చంద్రబాబు: స్వర్ణకారులకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు రుణాలిస్తాం. దుకాణ్.. మకాన్ స్కీమును పునరుద్ధరిస్తా. సొంత ఇంటి కల నెరవేరుస్తా. ఆభరణాలకు మార్కెటింగ్ పెరిగేలా చూస్తా.
హుస్సేన్: వైసీపీ ప్రభుత్వం వక్ఫ్ ఆస్తులను కబ్జా చేస్తోంది.
చంద్రబాబు: వక్ఫ్ ఆస్తులను గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫాలా కబ్జా చేస్తున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టం. ఆస్తులను పరిరక్షించి అవసరమైతే కొత్త చట్టం తీసుకొస్తాం. కబ్జాకు గురైన ఆస్తులను స్వాధీనం చేసుకుంటాం.
షేక్ ఫర్వీన్: టీడీపీకి మద్దతిస్తున్నానని రేషన్ కార్డు తొలగించారు. 30 సార్లు పంచాయతీ ఆఫీసు చు ట్టూ తిరిగినా కనికరించడం లేదు.
చంద్రబాబు: మీకు నిలిపేసిన పథకాలకు వడ్డీతో చెల్లిస్తాను. రేషన్, పెన్షన్ ఇలా ఏదైనా.. వడ్డీ జో డించి ఇస్తాను.
మస్తాన్బీ: పేద ముస్లింలకు దుల్హన్ పథకం ఇవ్వడం లేదు. పదో తరగతి అర్హ త ఉండాలని షర తు పెట్టారు.
చంద్రబాబు: దుల్హన్ పథకాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా అమలు చేస్తా. పెళ్లి రోజునే రూ.లక్ష ఆర్థిక సాయం చేతికందేలా చూస్తా.
రహంతుల్లా: మసీదు సర్వే నంబరులో ఉన్న ఆస్తులన్నీ వక్ఫ్ బోర్డులో కలిపేస్తూ జగన్ ప్రభుత్వం ఇటీవలే జీవో తెచ్చింది. దీనివల్ల మసీదుకు అనుసంధానంగా ఉన్న ఇళ్లల్లో ఉంటున్న వారు ఇబ్బందులు పడుతున్నారు.
చంద్రబాబు: ఆ జీవోని సరి చేసి మసీదు ఆస్తులు వక్ఫ్బోర్డు పరం కాకుండా చూస్తా.
సలాం: మీ దయ వల్ల మా అబ్బాయి విదేశాల్లో చదువుకుని జీవితంలో స్థిరపడిపోయాడు. విదేశీ విద్య పథకాన్ని పునరుద్ధరిస్తారా?
చంద్రబాబు: నేటి విజ్ఞాన యుగంలో ముస్లిం మైనారిటీలను బాగా చదివించేందుకు కచ్ఛితంగా విదేశీ విద్య పథకాన్ని మళ్లీ తీసుకొస్తా. రూ.10 లక్షల వరకు ఆర్థికసాయం అందిస్తా.
రషీద్: గతంలో చంద్రన్న బీమా వల్ల ఎంతో అండ ఉండేది. కుటుంబంలో ఎవరైనా చనిపోతే మట్టిఖర్చులకు రూ.5 వేలు, దశదిన కర్మ అయిపోయేలోపు రూ.2 లక్షల ఆర్థిక సాయం అందేది. ప్రమాదవశాత్తు చనిపోతే రూ.5 లక్షలు వచ్చేవి. జగన్ ప్రభుత్వం దానిని నిలిపేసింది.
చంద్రబాబు: మేం రాగానే ఆ పథకాన్ని పునరుద్ధరిస్తాం.
లారీ డ్రైవర్లు: రవాణా రంగాన్ని నమ్ముకుని ఎంతోమంది ముస్లింలున్నారు. గతంలో ఉచిత ఇసుక విధానం ఉన్నప్పుడు మాకు చేతినిండా పని ఉండేది. నేడు ఇసుక టన్నుకు రూ.675 వసూలు చేస్తున్నారు. అందులో రూ.375 జగన్కు, మిగతాది జేపీ, స్థానిక ఎమ్మెల్యే, పోలీసులకు వెళ్తోంది. రూ.200 ఉన్న గ్రీన్ట్యాక్స్ను రూ.10 వేలు చేశారు. ఓవర్హైట్ లోడ్ పేరుతో పెనాల్టీలను రూ.వెయ్యి నుంచి రూ.12 వేలకు పెంచారు. ఎంతోమంది లారీడ్రైవర్లు రోడ్డున పడ్డారు.
చంద్రబాబు: జగన్ ఉచిత ఇసుక పాలసీని రద్దు చేయగానే 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు. సిమెంట్ రంగంలో తన భారతీ సిమెంట్స్కు మేలు చేసేందుకు సిండికేట్ చేశాడు. ఆటోమొబైల్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టాడు. రోజూ సాయంత్రం కాగానే తాడేపల్లి ప్యాలె్సలో బటన్ నొక్కుతాడు. ఆ వెంటనే ఆయన కోట గేట్లు తెరుచుకుంటాయి. ఆ గేట్ల నుంచి మద్యం, ఇసుక, మైనింగ్, దందాల ద్వారా పోగు చేసిన సొమ్మంతా చేరుతుంది. ఇంత డబ్బు పిచ్చి ఉన్న సీఎంను చూడలేదు. పేదల కష్టాన్ని జలగాలా పీలుస్తున్నాడు. అందుకే ఆయన్ను జలగరెడ్డి అంటాను.