ఎయిర్ పోర్టూ లేదు.. పరిహారమూ లేదు!
ABN , First Publish Date - 2022-10-11T09:51:31+05:30 IST
ఎయిర్ పోర్టూ లేదు.. పరిహారమూ లేదు!
మా భూములు దున్నుకుంటాం
‘గడప గడప’లో కావలి ఎమ్మెల్యేను నిలదీసిన భూ నిర్వాసితులు
దగదర్తి, అక్టోబరు 10: ‘‘దామవరం వద్ద ఎయిర్ పోర్టు ఎగిరి పోయింది. అందుకోసం తీసుకున్న మా భూములకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో పరిహారం ఇస్తారన్న నమ్మకం పోయింది. ఇక మా భూములు మేము దున్నుకుంటాం’’ అంటూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తి మండలం కొత్తపల్లికౌరుగుంట గ్రామస్థులు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్రెడ్డిని నిలదీశారు. గ్రామంలో సోమవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయనకు ఈ అనుభవం ఎదురైంది. గ్రామానికి చెందిన విడవలూరు బుజ్జయ్య మాట్లాడుతూ.. దామవరం వద్ద అసైన్డ్ భూమి రెండెకరాలు ఎయిర్పోర్టు కోసం ఇచ్చామన్నారు. ప్రభుత్వం వచ్చి మూడేళ్లవుతున్నా ఇంతవరకు తమకు పరిహారం ఇవ్వలేదని తెలిపారు.