Vijayawada: ఎలక్ట్రిక్ బైక్ బాటరీ పేలి ఒకరు మృతి
ABN , First Publish Date - 2022-04-23T15:50:35+05:30 IST
నగరంలోని సత్యనారాయణపురం గులాబీ తోటలో ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి ఒకరు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
విజయవాడ: నగరంలోని సత్యనారాయణపురం గులాబీ తోటలో ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి ఒకరు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. శివకుమార్ అనే వ్యక్తి నిన్ననే కొత్త CORBETT14 ఎలక్ట్రిక్ బైక్ను కొనుగోలు చేశాడు. ఎలక్ట్రిక్ బైక్కు వచ్చిన బ్యాటరీ ఇంటిలోని పడుకునే గదిలో చార్జింగ్ పెట్టాడు. అయితే తెల్లవారుజామున బ్యాటరీ పేలి ఇల్లు మొత్తం మంటలు వ్యాపించాయి. శివ కుమార్తో పాటు భార్య, ఇద్దరూ పిల్లలు మంటల్లో చిక్కుకుపోయారు. పెద్ద ఎత్తున మంటలు, పొగ రావడంతో చుట్టు పక్కల వారు చూసి తలుపులు పగలగొట్టి ఇంట్లో వారిని బయటకు తీసుకువచ్చారు. అందరికీ తీవ్ర గాయాలతో పాటు శరీరం కాలి పోవడంతో వెంటనే 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. కాగా మార్గ మధ్యలో శివ కుమార్ మృతి చెందగా భార్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. పిల్లలను మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.