President Draupadi Murmu: రాష్ట్రపతి రాక నేడే

ABN , First Publish Date - 2022-12-04T03:59:15+05:30 IST

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పర్యటన నిమిత్తం నేడు రాష్ర్టానికి రానున్నారు. ఈ సారి విశాఖ నేవీడే ఉత్సవాలకు తివిధ దళాల అధిపతిగా రాష్ట్రపతి హాజరవుతుండడం ప్రత్యేకం.

 President Draupadi Murmu: రాష్ట్రపతి రాక నేడే

రాష్ట్రపతికి పౌర సన్మానం నేడు

సాయంత్రం విశాఖలో నేవీడే ఉత్సవాలకు

రేపు తిరుమల శ్రీవారి దర్శనం

అమరావతి, విశాఖపట్నం, తిరుపతి, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పర్యటన నిమిత్తం నేడు రాష్ర్టానికి రానున్నారు. ఈ సారి విశాఖ నేవీడే ఉత్సవాలకు తివిధ దళాల అధిపతిగా రాష్ట్రపతి హాజరవుతుండడం ప్రత్యేకం. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం 8 గంటలకు రాష్ట్రపతి ముర్ము ఢిల్లీ నుంచి బయలుదేరి 10.15 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి.. తాడిగడప పురపాలక సంఘం పరిధిలోని పోరంకి మురళి రిసార్టులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పౌర సన్మాన కార్యక్రమానికి హాజరవుతారు. గవర్నర్‌ హరిచందన్‌, సీఎం జగన్‌ ప్రభుత్వం తరఫున రాష్ట్రపతి ద్రౌపది ముర్మును సన్మానిస్తారు. అనంతరం, విజయవాడలోని రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్‌ ఏర్పాటు చేసిన విందులో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖపట్నం వెళ్తారు. ఆర్‌కే బీచ్‌లో నేవీ డే ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరవుతారు.

రాష్ట్రపతి రావడం ఇదే ప్రథమం!

నేవీడేకు దేశ రాజధానిలో కాకుండా మరో ప్రాంతంలో రాష్ట్రపతి హాజరు కావడం భారత నౌకాదళ చరిత్రలో ఇదే ప్రథమం. డిసెంబరు 4న నేవీ డేను అన్ని నౌకాదళాలు నిర్వహిస్తాయి. ప్రధాన వేడుక ఢిల్లీలో జరుగుతుంది. ఈసారి రాష్ట్రపతి విశాఖపట్నంలో తూర్పు నౌకాదళం నిర్వహించే నేవీ డేకి వస్తున్నారు. అనంతరం తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతి చేరుకుంటారు. అక్కడ రాత్రికి బస చేస్తారు. సోమవారం ఉదయం శ్రీవారి దర్శనం చేసుకుంటారు.

Updated Date - 2022-12-04T03:59:16+05:30 IST