TDP మద్దతుతో గెలిచిన సర్పంచ్ అంటే అంత చిన్నచూపా.. ఏంటిది..!?
ABN , First Publish Date - 2022-05-31T12:10:01+05:30 IST
టీడీపీ మద్దతుతో గెలిచిన బీసీ సర్పంచ్ అంటే అంత చిన్నచూపా? ..
- సచివాలయ భవన నిర్మాణం ఎప్పుడు పూర్తిచేస్తారో చెప్పండి!
- బొడ్డపాడు సర్పంచ్ నిలదీత
కృష్ణా జిల్లా/నందిగామ/తోట్లవల్లూరు : టీడీపీ మద్దతుతో గెలిచిన బీసీ సర్పంచ్ అంటే అంత చిన్నచూపా? 15 నెలలుగా చెట్టుకింద పరిపాలన చేస్తున్నాం.. గ్రామ సచివాలయ భవన నిర్మాణాన్ని పూర్తి చేయాల్సిందిగా కలెక్టర్ (Collector) ఆదేశించినా లెక్కలేదా? అంటు మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో బొడ్డపాడు సర్పంచ్ మూడే శివశంకర్ బైఠాయించి అధికారుల తీరుని ఎండగట్టారు. తోట్లవల్లూరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం సోమవారం ఎంపీపీ ఈడ్పుగంటి రాజామణి అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిధిగా ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ హాజరయ్యారు. పీఆర్ ఏఈ ఆర్ రాఘవరావు మా ట్లాడుతుండగా, బొడ్డపాడు సర్పంచ్ మూడే శివశంకర్ లేచి గ్రామ సచివాలయ భవనాన్ని ఎప్పటికి పూర్తిచేస్తారో చెప్పాలని, తాను సర్పంచ్గా గెలిచిన నాటి నుంచీ మభ్యపెడుతున్నారని నిలదీశారు.
వైస్ ఎంపీపీ సాంబశివారెడ్డి జోక్యం చేసుకుని ఏంటి.. నీ రుబాబు, సీటులో కూర్చుని మాట్లాడు అనటంతో మాటల యుద్ధం కొనసాగింది. వెళ్ళి సీట్లో కూర్చోవాలని ఎంపీడీవో స్వర్ణలత కోరటంతో మీరు ఇచ్చిన లెటర్ ఇదిగో దీనికి సమాధానం చెప్పండని సర్పంచ్ అన్నారు. గ్రామ సచివాలయ భవనాన్ని ఎప్పుడు పూర్తి చేస్తారో లెటర్ రాసిస్తేనే ఇక్కడ నుంచి లేస్తానని, అప్పటి వరకు బైఠాయింపు కొనసాగుతుందని శివశంకర్ స్పష్టం చేశారు. పీఆర్ డీఈ శ్రీనివాస్ వచ్చి జూలై నెలాఖరుకి పూర్తిచేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వటంతో సర్పంచ్ తన ఆందోళనను విరమించారు. వ్యవసాయశాఖ పనితీరుపై వైసీపీకి చెందిన కనకవల్లి సర్పంచ్ పి వెంకట నరసింహశర్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆరు నెలల నుంచి కంది విత్తనాలు అందించలేకపోయారన్నారు. మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఏప్రిల్ నెలలో కాన్పుకోసం వచ్చిన పిల్లివానిలంకకు చెందిన జ్యోతి (26) బిడ్డతో సహా మరణించిన ఉదంతంపై పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ సాయిప్రసన్నను ఎమ్మెల్యే వివరణ అడిగారు. ఇక నుంచి ఇలాంటి పరిస్థితులు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.చాలామంది అధికారుల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందని, పనితీరు మెరుగుపడాలని ఎమ్మెల్యే హెచ్చరించారు. జడ్పీటీసీ సభ్యుడు రామ్మోహన్రెడ్డి, ఎంపీడీవో స్వర్ణలత పాల్గొన్నారు.