ఉద్యోగులకు పీఆర్సీ కంటే ముఖ్యమైనది మరొకటి లేదు: Ashok
ABN , First Publish Date - 2022-01-07T17:39:20+05:30 IST
పీఆర్సీ విషయంలో జగన్ ప్రభుత్వ వ్యవహారశైలిపై టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అమరావతి: పీఆర్సీ విషయంలో జగన్ ప్రభుత్వ వ్యవహారశైలిపై టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేసి మెరుగైన డీఏలు, మెరుగైన పీఆర్సీ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి మోసం చేశారన్నారు. 27 శాతం ఐఆర్ ఇచ్చి 14.29 ఫిట్మెంట్ కంటే ఎక్కువ ఇవ్వలేను అని చెప్పడం ఎంప్లాయిస్ని మోసం చేయడమే అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆదాయం ఎక్కువ, వారితో పోల్చుకోవద్దని జగన్ చెప్పడంలో అర్థంలేదని విమర్శించారు. లిక్కర్, జీఎస్టీ, వ్యాట్ పెట్రోల్ ధరల వల్ల ఏపీ ఆదాయం పెరిగిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల బాధ, వ్యధను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని అన్నారు. దుర్మార్గం, వంచన, మోసాలతో వైసీపీ ప్రభుత్వం కాలం వెళ్లదీస్తోందని వ్యాఖ్యలు చేశారు. పాలు ఏవో, నీరు ఏవో ప్రభుత్వ ఉద్యోగస్థులు గ్రహించాలని సూచించారు. ప్రభుత్వ ఆర్థక పరిస్థితి ఉద్యోగస్థులకు ఏవిధంగానూ భారం కాదన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ కంటే ముఖ్యమైన విషయం మరొకటి ఉండదని గ్రహించాలని ఎమ్మెల్సీ అశోక్ బాబు పేర్కొన్నారు.