మూడో రోజు లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ నిరసన ర్యాలీ

ABN , First Publish Date - 2022-03-16T14:39:45+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కల్తీసారా మరణాలపై వరుసగా మూడో రోజూ టీడీపీ నేత లోకేష్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శాసనసభాపక్షం నిరసనకు దిగింది.

మూడో రోజు లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ నిరసన ర్యాలీ

అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కల్తీసారా మరణాలపై వరుసగా మూడో రోజూ టీడీపీ నేత లోకేష్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శాసనసభాపక్షం నిరసనకు దిగింది. జగన్ పాలనలో సారా అగ్గి సంసారం బుగ్గి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ముఖ్యమంత్రి మాటలు, పోలీసు ఎఫ్ఐఆర్లలో ఏది నిజం అంటూ నినాదాలు చేశారు. అసెంబ్లీలో అసత్య ప్రకటనలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. జంగారెడ్డిగూడెంలో సహజ మరణాలు కాదని, జగన్ రెడ్డి కల్తీసారా మరణాలే అంటూ నినాదాలు చేశారు. ఇంకెన్ని సారా చావులు జగన్ రెడ్డి కోరుకుంటారని ప్లకార్డులు ప్రదర్శించారు. సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీకి  తెదేపా శాసనసభ పక్షం నిరసన ర్యాలీ చేపట్టింది. కల్తీ సారా మరణాలపై ప్రశ్నిస్తే అన్యాయంగా తెలుగుదేశం సభ్యుల్ని సస్పెండ్ చేశారని మండిపడ్డారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ...  జంగారెడ్డి గూడెంలో కల్తీ సారా మరణాల సంఖ్య 27కు చేరిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కల్తీసారా వ్యాపారం చేసేది వైసీపీ నేతలే అని ఆరోపించారు. అసెంబ్లీలో సస్పెన్షన్ గీతలుగీసి మా నోరు నొక్కలేరని స్పష్టం చేశారు. అసెంబ్లీలో అసత్యాలు చెప్పినందుకు సీఎం నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 


రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ మాట్లాడుతూ... అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి అసత్యాలు చెప్పారన్నారు. ఆర్డీవో, పోలీసులు, ప్రభుత్వం పొంతనలేని ప్రకటన చేస్తున్నారని మండిపడ్డారు. ఆడబిడ్డల మాంగల్యం విలువ  సీఎంకు తెలియట్లేదన్నారు. కల్తీసారా మరణాలపై న్యాయ విచారణ జరిపించటంతో పాటు బాధిత కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-03-16T14:39:45+05:30 IST