ఆహారం కలుషితమై 14 మంది చిన్నారులకు అస్వస్థత
ABN , First Publish Date - 2022-02-26T23:38:06+05:30 IST
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలిలో అంగన్వాడీ కేంద్రం-2లో శనివారం పౌష్టికాహారం కలుషితమై 14 మంది చిన్నారులు అస్వస్ధతకు గురయ్యారు.
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలిలో అంగన్వాడీ కేంద్రం-2లో శనివారం పౌష్టికాహారం కలుషితమై 14 మంది చిన్నారులు అస్వస్ధతకు గురయ్యారు. ఉదయం పాలు తాగిన చిన్నారులు మధ్యాహ్నం వెజ్ బిరియాని (కిచిడి)ని తిన్నారు. అక్కడకు కొద్దిసేపటికే వాంతులు, విరేచనాలతో ఇబ్బందిపడ్డారు. చిన్నారులంతా అస్వస్థతకు గురికావడంతో అంగన్వాడీ సిబ్బంది తల్లిదండ్రులతో పాటు ఐసీడీఎస్ అధికారులకు సమాచారమిచ్చారు. చిన్నారులను హుటాహుటిన శ్రీకాకుళంలోని సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఈ కేంద్రంలో 25 మంది చిన్నారులు ఉండగా శనివారం 17 మంది హాజరయ్యారు. ఇందులో పాలు తాగిన 14 మంది అస్వస్థతకు గురయ్యారు. దీనిని బట్టి పాలు తాగడమే వల్లనే ఈ విధంగా జరిగిందని భావిస్తున్నారు.