ప్రజలకు అవసరమైన ఇసుక, సిమెంట్ ధరలు ఎందుకు తగ్గించరు?: సోమువీర్రాజు
ABN , First Publish Date - 2022-01-11T18:09:15+05:30 IST
సినిమా టిక్కెట్ల వివాదంలో ఏపీ ప్రభుత్వ తీరుపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు మండిపడ్డారు.
అమరావతి: సినిమా టిక్కెట్ల వివాదంలో ఏపీ ప్రభుత్వ తీరుపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు మండిపడ్డారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ టిక్కెట్ల అంశంలో ఏపీ ప్రభుత్వ ఆలోచన ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు అవసరమైన ఇసుక, సిమెంట్ ధరలు ఎందుకు తగ్గించరని ప్రశ్నించారు. సినిమా టిక్కెట్ ధరలు తగ్గించి గొప్పగా చెప్పుకుంటున్నారని ఆయన విమర్శించారు. సీఎం జగన్కు దమ్ముంటే బస్తా రూ. 1400కి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. గనులను జాతీయం చేస్తే ఏపీ ప్రభుత్వానికి అప్పులు చేయాల్సిన అవసరం ఉండదన్నారు. వైఎస్ హయాం నుంచి గనుల దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. ఎయిడెడ్ పాఠశాలలను నిర్వీర్యం చేసేందుకు ముఖ్యమంత్రి యత్నించారని, వైసీపీ నేతలే బియ్యం అక్రమ రావాణాలో కీలకపాత్ర పోషిస్తున్నారని సోము వీర్రాజు అన్నారు.