నిండు సభలో దుర్యోధన వికటాట్టహాసం
ABN , First Publish Date - 2022-09-19T10:13:42+05:30 IST
‘‘సీఎం జగన్ కుల రాజకీయాలు చేస్తున్నారు. నిండు శాసనసభలో కులాల గురించి మాట్లాడతారా? మూడేళ్లలో ఏ కులాన్ని ఉద్ధరించారు? ఏ కులం సంతోషంగా ఉంది? ఒక కులాన్ని, కొన్ని పత్రికలను, చానెళ్లను
జగన్ కుల రాజకీయాలు చేస్తున్నారు: సోమిరెడ్డి
హైదరాబాద్, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): ‘‘సీఎం జగన్ కుల రాజకీయాలు చేస్తున్నారు. నిండు శాసనసభలో కులాల గురించి మాట్లాడతారా? మూడేళ్లలో ఏ కులాన్ని ఉద్ధరించారు? ఏ కులం సంతోషంగా ఉంది? ఒక కులాన్ని, కొన్ని పత్రికలను, చానెళ్లను టార్గెట్ చేస్తూ శాసనసభలో ఒక సీఎం మాట్లాడ్డం దేశ చరిత్రలో ఇది తొలిసారి. నిండు సభలో దుర్యోధన వికటాట్టహాసం కనిపించింది. ఇది మంచిదికాదు’’ అని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఎన్టీఆర్ భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘వైసీపీ నాయకులు ఇసుక, మద్యం, గనులు, సరస్వతి పవర్ ప్లాంటు, భారతీ సిమెంట్సు, బెంగుళూరులో మంత్రి డెవలపర్స్, కమర్షియల్ కాంప్లెక్సులు నడుపుతారు. ఏపీలో మాత్రం అన్ని అనుమతులున్నా, ఇతరులెవరూ మైనింగ్ చేయడానికి వీల్లేదు. మీ పాలనలో ఏ రెడ్డి కుటుంబం బాగుపడింది? వ్యవసాయం కుప్పకూలి వారు ఆర్థికంగా చితికిపోయింది నిజం కాదా? ఏపీలో ఏ రిటైల్ వ్యాపారం చేయాలన్నా ఎమ్మెల్యేలు, మంత్రులు పర్మిషన్ ఇవ్వాలి. హోల్సేల్ అయితే సీఎం పర్మిషన్ ఇవ్వాలి. ఇదీ దౌర్భాగ్యం. జగన్ ప్రభుత్వం పతనమయ్యే రోజు దగ్గర్లోనే ఉంది’’ అని సోమిరెడ్డి అన్నారు. ‘‘మీ పత్రిక పచ్చి అవినీతితో పుట్టింది. మీడియాను నిందించే హక్కును మీకెవరిచ్చారు’ అని సీఎం జగన్ను సోమిరెడ్డి నిలదీశారు.