భువనేశ్వర్ ఎక్స్ప్రెస్లో పొగలు
ABN , First Publish Date - 2022-09-19T09:54:22+05:30 IST
తిరుపతి నుంచి భువనేశ్వర్ వెళ్లే సూపర్ఫాస్ట్ రైలు నుంచి ఒక్కసారిగా భారీగా పొగలు రావడంతో ప్రయాణికులు భయంతో రైలు దిగి పరుగులు తీశారు. ఈ సంఘటన నెల్లూరు నగరంలోని వేదాయపాళెం రైల్వేస్టేషన్ సమీపంలో ఆదివారం
నెల్లూరు (వెంకటేశ్వరపురం), సెప్టెంబరు 18: తిరుపతి నుంచి భువనేశ్వర్ వెళ్లే సూపర్ఫాస్ట్ రైలు నుంచి ఒక్కసారిగా భారీగా పొగలు రావడంతో ప్రయాణికులు భయంతో రైలు దిగి పరుగులు తీశారు. ఈ సంఘటన నెల్లూరు నగరంలోని వేదాయపాళెం రైల్వేస్టేషన్ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. రైల్వే అఽధికారుల కథనం మేరకు.. తిరుపతి నుంచి భువనేశ్వర్ వెళ్లే సూపర్ఫాస్ట్ రైలు (నెంబరు 22880) ఆదివారం మధ్యాహ్నం 12.40 సమయంలో నెల్లూరు సమీపంలో వెంకటాచలం రైల్వేస్టేషన్ దాటుతున్న సమయంలో స్టేషన్మాస్టర్ రైలుచక్రాల నుంచి పొగలు రావడం గమనించారు. వెంటనే రైలు లోకోపైలెట్ను అప్రమత్తం చేశారు. 12.50 సమయంలో వేదాయపాళెం సమీపంలో రైలును నిలిపివేశారు. ఒక్కసారిగా ఎస్-3 బోగి చక్రాల నుంచి భారీగా పొగలు రావడం మొదలయ్యాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా రైలు దిగి పరుగులు తీశారు. అప్రమత్తమైన రైల్వే అధికారులు పరిశీలించి, బ్రేకులకు ఇరువైపులా గల రబ్బరు డ్రమ్స్ కాలి పొగలు వచ్చినట్లు నిర్దారించారు. వెంటనే మరమ్మతులు చేసి రైలును 40 నిమిషాల తర్వాత పంపించారు.