కోటరీ కారణంగానే నాకు మంత్రి పదవి రాలేదు: సామినేని ఉదయభాను
ABN , First Publish Date - 2022-04-11T20:04:43+05:30 IST
ఈసారి తప్పకుండా తనకు మంత్రి పదవి వస్తుందని భావించానని సామినేని ఉదయభాను అన్నారు.
విజయవాడ: ఈసారి తప్పకుండా తనకు మంత్రి పదవి వస్తుందని భావించానని జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ సీఎం జగన్ వద్ద జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు కోటరీగా ఏర్పడ్డారని, వారి కోటరీ కారణంగానే తనకు మంత్రి పదవి రాలేదని భావిస్తున్నానని పరోక్షగా కోడలి నాని, పేర్ని నానిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. 2012 వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పని చేశానన్నారు. మాజీ ఎమ్మెల్యేగా తానే తొలుత పార్టీలో చేరినట్లు చెప్పారు. జగన్ను అరెస్టు చేస్తే... జిల్లాలో పార్టీ కోసం పని చేశానన్నారు. తన తరువాత వచ్చిన వారికి మంత్రి పదవి ఇచ్చినా తాను బాధ పడలేదన్నారు. రెండో విడత ఇస్తారని భావించానని.. ఇప్పుడు కూడా అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో మొదటి నుంచీ తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, పదవి వచ్చినా.. రాకున్నా.. జగన్కు విధేయునిగా ఉంటానని స్పష్టం చేశారు. మోపిదేవి, సజ్జల కూడా తనతో మాట్లాడారని, కాపులు నలుగురికి ఇచ్చారు... అందులో తాను గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. గతంలొ జగన్ స్వయంగా కాబోయే మంత్రిగా తనను ప్రకటించారని చెప్పారు.