భూమి హక్కులకు ప్రామాణికంగా రీ సర్వే రికార్డు
ABN , First Publish Date - 2022-08-17T07:52:17+05:30 IST
భూమి హక్కులకు ప్రామాణికంగా రీ సర్వే రికార్డు
రెవెన్యూ శాఖ ఉత్తర్వులు
అమరావతి, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భూమి హక్కులకు.. రీ సర్వే రికార్డు (ఆర్ఎల్ఆర్)ను ప్రామాణికంగా తీసుకోవాలని రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల చట్టం(రికార్డ్ ఆఫ్ రైట్స్-ఆర్వోఆర్)-1971 అమలుపై తీసుకొచ్చిన రూల్స్ను తాజాగా సవరించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ సర్వే, సరిహద్దుల చట్టం-1923 ప్రకారం.. రీ సర్వే జరుగుతున్న గ్రామాల్లో రూపొందించిన రీ సర్వే ల్యాండ్ రిజిస్టర్ (ఆర్ఎల్ఆర్)ను భూమి హక్కుల రూపకల్పనకు ప్రాథమిక రికార్డుగా పరిగణించాలని ఇటీవల రెవెన్యూ శాఖ ఆర్వోఆర్ రూల్స్ను సవరిస్తూ ఫైనల్ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పుడు ఈ రూల్స్ను అమల్లోకి తీసుకొస్తూ రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ జీవో 573 జారీ చేశారు. భూమి హక్కుల రిజిస్టర్ 1-బీ తయారీకి ఆర్ఎల్ఆర్ను ప్రాథమికంగా పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. ఇదే విషయమై రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో భూమి హక్కుల రిజిస్టర్ను నవీకరించడానికి సర్వే కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేయొచ్చని తెలిపారు.