ఉసురు తీసిన అధికారం
ABN , First Publish Date - 2022-08-08T10:04:53+05:30 IST
వరద ముంపు నుంచి తన పొలాన్ని రక్షించుకొనేందుకు రూ.లక్షలతో వేసుకున్న మట్టికట్టను అధికారులు తొలగించడం..

- పొలంలో మట్టి కట్ట తొలగింపుపై వివాదం
- అధికారుల దౌర్జన్యంతో రైతు మనస్తాపం
- పురుగుల మందు తాగిన భూ యజమాని మృతి
- బాధ్యులపై కఠిన చర్యలకు మృతుడి భార్య డిమాండ్
అమరావతి, ఆగస్టు 7: వరద ముంపు నుంచి తన పొలాన్ని రక్షించుకొనేందుకు రూ.లక్షలతో వేసుకున్న మట్టికట్టను అధికారులు తొలగించడం... ఈ క్రమంలో వారి దౌర్జన్యంపై మనస్తాపంతో ఓ రైతు బలవనర్మరణానికి పాల్పడ్డాడు. వివరాలు... గుంటూరు జిల్లా అమరావతి మండల పరిధిలోని ఉంగుటూరు గ్రామానికి చెందిన రైతు ముత్తవరపు నందకిశోర్(30), ఆయన సోదరుడు పవన్కు గ్రామంలోని చెరువు సమీపంలో పొలం ఉంది. వర్షాలు పడినప్పుడు చెరువు నీరు పొంగి పొలంపైగా ప్రవహిస్తుండటంతో పంట నష్టపోతున్నారు. దీంతో పొలంలోకి ముంపు నీరు రాకుండా మట్టి కట్ట వేసుకున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు 14వ మైలు నుంచి ఉంగుటూరు వెళ్లే మార్గంలో రహదారిపై నీరు నిలిచింది. వీరి పొలం వద్ద వేసిన మట్టి కట్ట కారణంగానే నీరు నిలిచిదంటూ శనివారం రెవెన్యూ అధికారులు ఎక్స్వేటర్తో ఆ కట్టను తొలగించారు. అడ్డుకునేందుకు యత్నించిన నందకిశోర్ను పక్కకు నెట్టేశారు. ఎక్స్కవేటర్కు అడ్డుగా పోయిన పవన్ తలకు గాయమైంది. అధికారుల తీరుతో మనస్తాపం చెందిన నందకిశోర్ పురుగుల మందు తాగడంతో ఆయన్ను గుంటూరులోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు... మృతదేహాన్ని జీజీహెచ్కి తరలించారు.
వైసీపీ నాయకుల వల్లే..
స్థానిక వైసీపీ నాయకుల ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీసు అధికారులు బలవంతంగా ఎక్స్వేటర్తో మట్టి కట్టను తొలగించారని, అడ్డుకున్న తన భర్త, మరిదిపై దౌర్జన్యం చేశారని నందకిశోర్ భార్య జయలక్ష్మి ఆరోపించారు. అధికారుల దౌర్జన్యం కారణంగా తన భర్త పోలీసుల ఎదుటే పురుగుల మందు తాగారని, భర్త మృతికి కారణమైన అధికారులు, వైసీపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకుని తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె కన్నీటిపర్యంతమైంది. ముంపు నుంచి రక్షణకు చెరువులోని మట్టి తోలుకోమని సలహా ఇచ్చిన వైసీపీ నాయకులు...ఆ తర్వాత అధికారులకు ఫిర్యాదు చేశారని పవన్ తెలిపారు. తన అన్న మృతికి వైసీపీ నాయకులే కారణని ఆరోపించారు.
నందకిశోర్ది ప్రభుత్వ హత్య
నందకిశోర్ మరణం ప్రభుత్వ హత్యని మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు. ఆదివారం ఆయన నందకిశోర్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించాల్సిన అధికారులే అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా వ్యవహరించారన్నారు. నందకిశోర్ భూమికి ముందుగా వేరే రైతు గోడకట్టి దానిపై మట్టిపోసినా దాని జోలికి వెళ్లలేదన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని, రైతు మృతికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని శ్రీధర్ డిమాండ్ చేశారు.