CM Mamata వ్యాఖ్యలతో ఏపీలో కలకలం.. అసలేంటీ ‘పెగాసస్’ రాద్ధాంతం..!?
ABN , First Publish Date - 2022-03-19T08:21:53+05:30 IST
CM Mamata వ్యాఖ్యలతో ఏపీలో కలకలం.. అసలేంటీ ‘పెగాసస్’ రాద్ధాంతం..!?
- టీడీపీ, వైసీపీ మధ్య మాటలయుద్ధం
- చంద్రబాబు ప్రభుత్వం కొన్నదన్న బెంగాల్ సీఎం
- అబద్ధమంటూ ఖండించిన టీడీపీ నేత లోకేశ్
(అమరావతి, ఆంధ్రజ్యోతి) : ఫోన్లను దొంగచాటుగా వినే పెగాసస్ సాఫ్ట్వేర్ పై రాష్ట్రంలో మాటల యుద్ధం మొదలైంది. టీడీపీ ప్రభుత్వం దీనిని కొనుగోలు చేసిందని వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా.. అటువంటిది జరగలేదని టీడీపీ నేతలు ఖండిస్తున్నారు. ఈ సాఫ్ట్వేర్ వ్యవహారం జాతీయ స్థాయిలో కొంతకాలం క్రితం మంటలు రేపగా, ఇప్పుడు ఆకస్మికంగా రాష్ట్రంలో కలకలం కలిగించింది. ఇజ్రాయిల్కు చెందిన ఎస్ఓఎస్ సంస్థ దీనిని తయారు చేసి విక్రయిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం దీనిని కొనుగోలు చేసింద ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్య కలకలానికి కారణమైంది. ‘‘పెగాసస్ సాఫ్ట్వేర్ సృష్టికర్తలు నాలుగైదు ఏళ్ల కిందట మా పోలీస్ శాఖను సంప్రదించారు. రూ.25 కోట్లకు దానిని విక్రయిస్తానని బేరం పెట్టారు. కా నీ మేం తిరస్కరించాం. అదే సమయంలో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం దీనిని కొనుగోలు చేసింది’’ అని ఆమె బెంగాల్ అసెంబ్లీలో 2 రోజుల క్రితం చెప్పారు. ఇందులో ఏ మాత్రం నిజం లేదని చం ద్రబాబు కుమారుడు, ఆయన ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రిగా చేసిన లోకేశ్ పేర్కొన్నారు. ‘మా హయాంలో సాఫ్ట్వేర్ కొనుగోలుకు ఆఫర్ వచ్చిం ది. కానీ చంద్రబాబు కొనలేదు. చట్ట విరుద్ధ చర్యలను ఆయన ప్రోత్సహించలేదు. అనుమతించలేదు. మేం దానిని కొని ఉంటే జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవారే కాదు. మమతా బెనర్జీకి సరైన సమాచారం లేక చెప్పి ఉంటారు’’ అని ఆయన అన్నారు.
తమ ప్రభుత్వం దిగిపోయి వైసీపీ ప్రభు త్వం వచ్చి మూడేళ్లయిందని, తాము ఒకవేళ దా నిని కొనుగోలు చేసి ఉంటే ఈ ప్రభుత్వం దానిని ఏనాడో బయట పెట్టి ఉండేదన్నారు. తాజాగా టీడీపీ వర్గాలు గత డీజీపీ గౌతం సవాంగ్ కార్యాలయం సమాచార హక్కు చట్టం కింద ఇచ్చిన సమాధానాన్ని కూడా వెలుగులోకి తెచ్చాయి. కర్నూలు జిల్లాకు చెందిన నాగేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి గత ఏడాది జూలై 25న డీజీపీ కార్యాలయం నుంచి సమాచార హక్కు చట్టం కింద దీనిపై సమాచారం కోరారు. పెగాసస్ సాఫ్ట్వేర్ను కొనుగోలు చేశారా.. అధికారులు ఎవరు దానిని పర్యవేక్షిస్తున్నారు.. ఎక్కడ వినియోగిస్తున్నారో తెలపాలని కోరారు. అదే ఏడాది ఆగస్టు 8న డీజీపీ కార్యాలయం ఆయనకు సమాధానం ఇచ్చింది. ఈ సాఫ్ట్వేర్ను తమ శాఖ ఎప్పుడూ కొనుగోలు చేయలేదన్నారు. ఈ సాఫ్ట్వేర్ను తయారు చేసిన కంపెనీ.. తాము నేరుగా ప్రభుత్వాలకే తప్ప ఇతరులకు దానిని విక్రయించలేదని.. అది తమ కం పెనీ విధానమని గతంలో ప్రకటించింది. డీజీపీ కార్యాయం ఇచ్చిన సమాధానంతో దీనిపై స్పష్టత వచ్చిందని, వైసీపీ నేతలు ఊకదంపుడు ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ విమర్శిస్తోంది.
మా ఫోన్లే ట్యాప్ అవుతున్నాయి: సోమిరెడ్డి
వైసీపీ హయాంలో తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి శుక్రవారం ఆరోపించారు. ‘‘టీడీపీ నేతలు, కొందరు అధికారులు, మీడియా ప్రతినిధుల ఫోన్ల ను ఈ ప్రభుత్వం దొంగతనంగా వింటోందన్నది బహిరంగ రహస్యం. ప్రభుత్వపరంగా కాకుండా వైసీపీ పార్టీపరంగా ఒక సాఫ్ట్వేర్ ద్వారా ఈ ట్యాపింగ్కు పాల్పడుతున్నారని మేం నమ్ముతు న్నాం. తప్పుడు పని వాళ్లు చేస్తూ మాపై ఆరోపణలు చేయడానికి సిగ్గుండాలి’’ అని ఆయన వ్యా ఖ్యానించారు. పెగాసస్ సాఫ్ట్వేర్ను చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు చేసిందని బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కోసం ఎన్నికల్లో పనిచేసిన ప్రశాంత్ కిషోర్ తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారన్నారు. ‘‘గతంలో ప్రశాంత్ కిషోర్.. జగన్ రెడ్డి కోసం పనిచేశారు. ఆ సమయంలో చంద్రబాబుపైనా... లోకేశ్పైనా దుష్ప్రచారం చేసి జగన్ రెడ్డికి లబ్ధి కలిగించారు. కోడి కత్తి, వివేకా హత్య సంఘటనలో టీడీపీపై దుష్ప్రచారం వంటివి పీకే వ్యూహాల్లో భాగమే. అదే వ్యూహాన్ని బెంగాల్లో కూడా అమలుచేసి మమత కాలుకు కట్టు కట్టి తి ప్పారు. మమతకు, జగన్రెడ్డికి ఎన్నికల వ్యూహాలు అందిస్తోంది ఆయనే. ఈ సాఫ్ట్వేర్ను టీడీపీ ప్ర భుత్వం కొనుగోలు చేసి ఉంటే వివేకా హత్య జరిగేది కాదు. కేంద్రం అనుమతి లేకుండా ఈ సాఫ్ట్వేర్ను ఎవరూ కొనుగోలు చేసే అవకాశమే లేదు. మోదీ ప్రభుత్వం దీనిని కొనుగోలు చేసిందని ఆరోపణలు వచ్చాయి. సుప్రీం కోర్టు దీనిపై విచారణ కమిషన్ వేసింది’’ అని సోమిరెడ్డి పేర్కొన్నారు.
సవాంగన్నే చెప్పారు: అయ్యన్న
‘‘నాటి చంద్రబాబు ప్రభుత్వం పెగాసస్ సాఫ్ట్వేర్ కొనలేదని స్వయంగా నీ సవాంగన్నే చెప్పారు జగన్రెడ్డి. దీనిపై నాటి డీజీపీ సవాంగ్ 12.8.2021 స్పష్టత ఇచ్చారు’’ అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ట్వీట్ చేశారు. తాను, తన మీడియా చేసేవన్నీ అసత్య ప్రచారాలే అని జగన్ బయటపెట్టడమే దేవుడి స్ర్కిప్ట్ అని వ్యాఖ్యానించారు.
బాబాయిని కాపాడేవాళ్లం: బీటెక్ రవి..
తమ దగ్గర పెగాసస్ ఉంటే అబ్బాయిల గుండెపోటు నుంచి బాబాయ్ వివేకాను కాపాడేవాళ్లమని టీడీపీ నేత బీటెక్ రవి ట్వీట్ చేశారు. తప్పు డు పనులు చేసి చిప్పకూడు తినడానికి చంద్రబాబు.. జగన్రెడ్డి కాదని మాజీ మంత్రి జవహర్ అన్నారు. ‘‘స్వలాభం కంటే వ్యవస్థలే ముఖ్యం అని బలంగా నమ్మే గొప్ప వ్యక్తి చంద్రబాబు. అందుకే మూడేళ్ల నుంచి ఆయన వెంట్రుక కూడా పీకలేకపోయారు’’ అని ఎద్దేవా చేశారు.