అయ్యో...రమణమ్మ!
ABN , First Publish Date - 2022-05-21T08:59:14+05:30 IST
అయ్యో...రమణమ్మ!
లారీ డ్రైవర్ నిర్దయతో గాలిలో కలిసిన ప్రాణం
గుంటూరు (సంగడిగుంట), మే 20 : డబ్బులు లేని నిస్సహాయత....లారీ డ్రైవర్ నిర్దయ వెరసి ఓ పేదరాలి ప్రాణం తీసింది. నలుగురు పిల్లలను అనాథలుగా చేసింది. వివరాలు... పల్నాడు జిల్లా చిలకలూరిపేట సుగాలికాలనీకి చెందిన ప్రతాప రమణమ్మ (40) భర్త కోటేశ్వరరావు ఏడాది క్రితం మృతి చెందాడు. ఆమెకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడు సంతానం. ప్రతిరోజు చిలకలూరిపేట నుంచి డంపింగ్ యార్డు వద్దకు వచ్చి చిత్తు కాగితాలు ఏరుకుని వాటిని మళ్లీ చిలకలూరిపేట తీసుకువెళ్లి అమ్ముకుని జీవనం సాగిస్తుంటుంది. శుక్రవారం గుంటూరు వచ్చేందుకు పేట వద్ద ఓ లారీ ఎక్కి డంప్ యార్డు వద్ద దిగింది. కిరాయి డబ్బుల వద్ద డ్రైవర్తో వాదన జరిగింది. డబ్బుల బదులు సెల్ తీసుకుని లారీని ముందుకు పోనిచ్చాడు. ఫోను కోసం లారీ వెంటవెళుతూ వెనుక చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. డ్రైవర్ లారీని ప్రత్తిపాడు సమీపంలో వదిలి పరారయ్యాడు. నల్లపాడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తల్లి కూడా మరణించడంతో నలుగురు పిల్లలు దిక్కులేనివారయ్యారు.