‘ఒరిజినల్’ దొరకాలి!
ABN , First Publish Date - 2022-08-11T08:02:55+05:30 IST
‘ఒరిజినల్’ దొరకాలి!
అప్పటిదాకా ఏమీ చెప్పలేం
ఆ వైరల్ వీడియోను ఫోరెన్సిక్కు పంపించలేదు
అందులో ఉన్నది మాధవ్ అని నిర్ధారించలేం
ఒక ఫోన్లో ప్లే అవుతున్న దాన్ని రికార్డు చేశారు
తొలుత యూకే నంబరు నుంచి ఐ-టీడీపీ వాట్సాప్కు
‘డర్టీ పిక్చర్’పై అనంత ఎస్పీ వివరణ
అనంతపురం, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో అసలుదో, కాదో చెప్పలేమని అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తిరుగుతున్న వీడియోలో రకరకాల యాడింగ్లు, ఎడిటింగ్లు ఉన్నాయన్నారు. అంతేకాకుండా... ఒక ఫోన్లో ప్లే అవుతున్న వీడియోను మరో ఫోన్ ద్వారా రికార్డు చేశారని, ఆ వీడియో క్లిప్నే సోషల్ మీడియాలో పెట్టారని చెప్పారు. అందువల్ల... ఒరిజినల్ వీడియో (ఫోన్లో ప్లే అవుతున్న వీడియో) దొరికేదాకా ఏమీ చెప్పలేమని ఆయన అన్నారు. ఆ వీడియో దొరికితేనే ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపుతామని స్పష్టం చేశారు. ఒరిజినల్ వీడియో దొరికితే తప్ప.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలోని వ్యక్తి గోరంట్ల మాధవో కాదో నిర్ధారించలేమని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపలేదన్నారు. బుధవారం ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. గోరంట్ల మాధవ్ అభిమాని కొనతాలపల్లి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి ప్రాథమిక దర్యాప్తు జరిపామని ఫక్కీరప్ప చెప్పారు. ‘‘ఆ వీడియోను తొలిసారిగా ఐ-టీడీపీ అఫిషియల్ అనే వాట్సాప్ గ్రూపులో ఈ నెల 4న అర్ధరాత్రి దాటాక 2.07 గంటలకు 447443703968 నంబర్ నుంచి పోస్టు చేసినట్లు తేలింది. ఈ నంబర్ యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో వాడుతున్న వోడాఫోన్ సర్వీసుదని వెల్లడైంది. ఆ వ్యక్తి వివరాలు సేకరించే దిశగా దర్యాప్తు కొనసాగుతోంది. ఆ వ్యక్తితోపాటు మరో నలుగురికి ఇంకెవరో ఫార్వర్డ్ చేసినట్లుగా విచారణలో తేలింది. అయితే... సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఒరిజినల్ది కాదు. ఒకవ్యక్తి రికార్డు చేసిన వీడియోను ఇంకొకరికి పంపించి, ఆ వ్యక్తి తన మొబైల్లో చూస్తున్నప్పుడు మరో వ్యక్తి రికార్డు చేశారు. అందువల్ల ఆ వీడియో ఒరిజినల్ అని నిర్ధారించలేకపోతున్నాం’’ అని ఎస్పీ చెప్పారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో ఒరిజినల్ కానందున... మార్ఫింగ్ లేదా ఎడిటింగ్ జరిగి ఉండొచ్చన్న అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఆ వీడియోలో ఉన్నది ఎంపీ గోరంట్ల మాధవా...? కాదా అని తేల్చలేమని అన్నారు. ఆ వీడియోకు సంబంధించి బాధితులెవరూ ఇప్పటి వరకూ ఫిర్యాదు చేయలేదని ఎస్పీ తెలిపారు. మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ... ఈ అంశంపై ఎంపీ మాధవ్ ఎలాంటి ఫిర్యాదు చేయలేదని స్ప ష్టం చేశారు. ‘‘బాధితులెవరైనా వచ్చి ఫిర్యాదు చేస్తే.. ఎంపీదేకాదు, ఎవరి సెల్ఫోన్ అయినా సీజ్ చేస్తాం’’ అని తెలిపారు.