ఢిల్లీ పర్యటనలో ఏపీ గవర్నర్ బిజీ బిజీ

ABN , First Publish Date - 2022-04-24T16:21:09+05:30 IST

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు.

ఢిల్లీ పర్యటనలో ఏపీ గవర్నర్ బిజీ బిజీ

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. ఆదివారం ఉదయం గవర్నర్ దంపతులు యుద్ధ స్మారక కేంద్రాన్ని సందర్శించారు. రేపు (సోమవారం) గవర్నర్ రాష్ట్రపతితో భేటీ కానున్నారు. మంగళవారం ఢిల్లీ నుంచి బయలుదేరి విజయవాడ రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. 


నిన్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్‌లో పరిణామాలపై నివేదిక ఇచ్చారు. రాష్ట్రంలో పరిణామాలపై చర్చించారు. సుమారు 40 నిముషాలపాటు ఈ భేటీ జరిగింది. కేవలం మర్యాదపూర్వకంగానే ఈ సమావేశం జరిగినట్లు చెబుతున్నా... ఏపీలో ఉన్నటువంటి తాజా పరిస్థితులపై చర్చలు జరిపి, నివేదిక ఇచ్చారు. రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది.. దానికి కారణాలు.. అక్కడ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు.. వాటి కోసం ఏ విధంగా అప్పులు చేస్తున్నది, అభివృద్ధి ఏ మేరకు ఉందన్నదానిపై చర్చలు జరిపినట్లు సమాచారం. అలాగే వివిధ రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షాను కలుస్తున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై కూడా నరేంద్ర మోదీ, అమిత్‌షాతో భేటీ అయ్యారు. ఆ రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ఒక నివేదిక అందజేశారు. మరో రెండు నెలల్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులపై గవర్నర్ల ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో పరిస్థితులపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది.

Updated Date - 2022-04-24T16:21:09+05:30 IST