CM Jaganకు నారా లోకేష్ లేఖ.. పలు ప్రశ్నలు..
ABN , First Publish Date - 2022-05-16T20:34:50+05:30 IST
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ లేఖ రాశారు...

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) లేఖ రాశారు. ఈ లేఖలో జగన్కు ఓ ప్రకటన రూపంలో లోకేష్ పలు ప్రశ్నలు సంధించారు.
ప్రశ్నలు ఇవే..
1) అప్పుల అనుమతి కోసం వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల మెడకి ఉరితాళ్లు బిగించిన నీచుడు ఎవరు..?
2) మూడేళ్ల పాలనలో ఒక్కటంటే ఒక్క చిన్న పిల్ల కాలువ తవ్వారా.. ఒక్క చిన్న సాగు నీటి ప్రాజెక్ట్ కట్టారా..?
3) రైతుల నుంచి గత ఏడాది కొన్న ధాన్యం డబ్బులు ఇచ్చారా.. ? ఈ ఏడాది ధాన్యం కొన్నారా..?
4) 3500 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏమైంది..?
5) ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడ.. ?
6) తుఫాన్లు, అకాల వర్షాలతో, నష్టపోయి రైతులకు పంట నష్టం పరిహారం ఎంత ఇచ్చారు..?
7) పంటలబీమా ప్రీమియం కట్టామన్నారు.. రైతులకి ఇన్సూరెన్స్ వర్తించలేదెందుకు..?
8) రూ.12,500 రైతు భరోసా ఇస్తానని, రూ.7,500 ఇస్తుంది ఎవరు..?
9) రాష్ట్రవ్యాప్తంగా వున్న కౌలురైతులని అసలు గుర్తించారా..?
10) వ్యవసాయ యాంత్రీకరణ, డ్రిప్ ఇరిగేషన్, సూక్ష్మపోషకాలు లాంటివి ఏమయ్యాయి..?
11) కేంద్రం తెచ్చిన వ్యవసాయరంగ వ్యతిరేక బిల్లులకు మద్దతు ఇచ్చిన మూర్ఖుడు ఎవరు..?
12) ఆంధ్రప్రదేశ్ ఎప్పుడో మర్చిపోయిన క్రాప్ హాలిడే మళ్ళీ తీసుకొచ్చిన అసమర్థుడు ఎవరు..?
13) టిడిపి హయాంలో రైతులకు రూ.3లక్షల వరకు సున్నావడ్డీ నిబంధనని కేవలం రూ.1లక్షకే పరిమితం చేసింది ఎవరు..?
14) రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మూడవస్థానంలో వుండటానికి కారకుడివి నీవు కాదా..?
15) ముదిగొండ లో 8 మంది రైతుల్ని కాల్చి చంపిన మీ నాన్న గారి చరిత్ర మర్చిపోయారా..?
16) సోంపేటలో తమ భూముల్ని లాక్కోవద్దని ఆందోళన చేసిన రైతులు ఆరుగుర్ని కాల్చి చంపించింది.. మీ నాయన రాజశేఖరెడ్డి కాదా..?
17) రాజధాని కోసం భూములిచ్చిన రైతులు శాంతియుతంగా ఆందోళనలు చేస్తే టెర్రరిస్టుల్లా అమరావతి రైతులకి సంకెళ్లు వేసింది ఏ రాక్షసుడు ఆదేశాలతో? అని జగన్పై వరుస ప్రశ్నల బాణాలు సంధించారు. అయితే ఈ ప్రశ్నలకు వైసీపీ నుంచి ఎలాంటి సమాధానాలు వస్తాయో వేచి చూడాలి.
కాగా.. అంతకుముందు లోకేష్ ట్విట్టర్ వేదికగా.. గ్రామగ్రామాన వైసీపీ నేతలను ప్రజలు అడ్డుకుంటున్నారని రాసుకొచ్చారు. జగన్ బాదుడే బాదుడు తట్టుకోలేని జనం వైసీపీ నేతలను నిలదీస్తున్నారని.,. ప్రజా తిరుగుబాటుతో వైసీపీ నేతలు ఆందోళనలో ఉన్నారన్నారు. సీఎం జగన్ కూడా అధికారుల రక్షణతోనే బయటకు వస్తున్నారని విమర్శలు గుప్పించారు. ప్రజా వ్యతిరేకత ఎలా ఉందో జగన్ సర్కార్కు ఇప్పుడు అర్థమవుతోందని లోకేష్ వ్యాఖ్యానించారు.