ముత్తంశెట్టికి నిరసన సెగ
ABN , First Publish Date - 2022-07-18T08:58:43+05:30 IST
ముత్తంశెట్టికి నిరసన సెగ
‘గడపగడప’లో నిలదీసిన జనం
ఎండాడ(విశాఖ సిటీ), జూలై 17: ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు మహిళల నుంచి తీవ్ర నిరసన సెగ తగిలింది. జీవీఎంసీ ఎనిమిదో వార్డు పరిధి ఎండాడ బీసీ కాలనీలో ఆదివారం ఆయన పర్యటిస్తుండగా పలువురు మహిళలు సమస్యలపై నిలదీశారు. తనకు చేదోడు పథకం రాలేదని రజక వీధికి చెందిన భవానీ అనే మహిళ చెప్పగా, ఆయన వెంటనే సచివాలయ కార్యదర్శిని పిలిపించి ఆరా తీశారు. ఆమెకు షాపు లేదని చెప్పడంతో... ఇక్కడ చాలా మందికి షాపులు లేకుండానే చేదోడు పథకం వర్తింపజేశారని, తనకు ఉద్దేశపూర్వకంగానే నిలిపివేశారని ఆమె ఆరోపించారు. తాను ఆరోగ్యశ్రీకి అర్హురాలిని కాదంటున్నారని ఉప్పూలూరి నారాయణమ్మ అనే మహిళ వాపోయింది. స్పందించిన ముత్తంశెట్టి.. ఆమెకు వెంటనే ఆరోగ్యశ్రీ అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్ రాముని ఆదేశించారు. అనంతరం ఎండాడ ఎస్సీ కాలనీలోకి వెళ్లారు. తమ కాలనీలో అభివృద్ధి పనుల కోసం రూ.కోట్లు ఖర్చు చేశామని చెబుతున్నారని, అలాంటప్పుడు రహదారులు అధ్వానంగా ఎందుకు ఉన్నాయని కాలనీ యూత్ అసోసియేషన్ కార్యదర్శి బెల్లం శ్రీను ప్రశ్నించారు. అప్పటికే పలుచోట్ల ప్రజలు నిలదీయంతో తీవ్ర అసహనంతో ఉన్న ఎమ్మెల్యే ముత్తంశెట్టి.. ఆవేశంతో ఊగిపోయారు. టీడీపీ, జనసేన నాయకులు వచ్చి గోల చేస్తున్నారని, నిలదీస్తున్న వారి సంగతి చూడాలని పోలీసులను ఆదేశించారు..