మూడేళ్లకు మొక్కబడిగా..!

ABN , First Publish Date - 2022-12-01T23:17:51+05:30 IST

‘‘అధికారంలోకి రాకముందు అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చేపట్టిన పాదయాత్రలో ప్రతి ఏటా పోలీసు శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన విడుదల చేస్తాం. వారాంతపు సెలవులు మంజూరు చేస్తాం’’ అని హామీల వర్షం కరిపించారు. అయితే, వైసీపీ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు దాటిన తర్వాత తొలిసారిగా పోలీసు ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన విడుదల చేశారు. అయితే, భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తారని అనుకున్న నిరుద్యోగుల ఆశలపై నీరు చల్లినట్టు అయ్యింది. జిల్లాలో 160 సివిల్‌ కానిస్టేబుల్‌, రేంజ్‌ పరిధిలో 55 ఎస్‌ఐ పోస్టులను భర్తీ చేసేలా ఇటీవల నోటిఫికేషన విడుదలైంది. అయితే, జగన ఇచ్చిన హామీల్లో పోలీసులకు వారాంతపు సెలవు మంజూరు ఇప్పటికీ అమలు కాలేదు.

మూడేళ్లకు మొక్కబడిగా..!

ఎస్‌ఐ పోస్టులు 55, సివిల్‌ కానిస్టేబుల్‌ 160 భర్తీకి నిర్ణయం

600 మంది అవసరమని గతంలోనే నివేదిక

కనీసం మూడో వంతు పోస్టులు కూడా విడుదల చేయని ప్రభుత్వం

పెదవి విరుస్తున్న నిరుద్యోగులు

నెల్లూరు (క్రైం), డిసెంబరు 1 : అంతర్జాతీయ నియమావళి ప్రకారం ప్రతి 200 మందికి ఒక పోలీసు ఉండాలి. అయితే మన జిల్లాలో వెయ్యి మందికి ఒక పోలీసు కూడా లేడని లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలో ఐదు సబ్‌డివిజన్లు, 52 పోలీసు స్టేషన్లు, 2500 మందికిపైగా అధికారులు, సిబ్బంది ఉన్నారు. వీరిలో ఏఆర్‌, స్పెషల్‌ పార్టీ ఇలా ప్రత్యేక సిబ్బందిని మినహాయిస్తే ప్రజల రక్షణ కోసం అందుబాటులో ఉండేది కేవలం 1500 మంది మాత్రమే. ప్రతి 200 మందికి ఓ పోలీసు ఉండాలంటే జిల్లాలో ప్రస్తుత జనాభా సుమారు 27 లక్షలపైమాటే. దీనిప్రకారం 13 వేల మందికిపైగా పోలీసు సిబ్బంది ఉండాలి.

కేసుల ఛేదన ఆలస్యం

జిల్లా పోలీసు శాఖలో సిబ్బంది కొరత కేసుల ఛేదనలో స్పష్టంగా తెలుస్తోంది. ఇటీవల క్రైం రేట్‌ బాగా పెరిగిపోతోంది. ప్రతి చిన్న విషయానికి కూడా ప్రజలు పోలీ్‌సస్టేషన గడప తొక్కుతున్నారు. అలాగే సైబర్‌ నేరాల సంఖ్య విపరీతంగా పెరగడంతో టెక్నాలజీని ఉపయోగించి ఆ కేసులను పరిష్కరించడం పోలీసులకు తలనొప్పిగా మారింది. మరోవైపు ‘‘గడప గడపకు ప్రభుత్వం’’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలకు రక్షణగా పోలీసు సిబ్బందిని పంపాల్సి ఉంది. ఇక వీఐపీలు, వీవీఐపీల పర్యటన నేపథ్యంలోనూ బందోబస్తు కోసం పోలీసుల అవసరం ఉంటోంది. ఇలా అన్నిరకాల విధులు తలపై పడుతుండటంతో పోలీసు శాఖను ఒత్తిడిలోకి నెట్టేస్తోంది. మరోవైపు జిల్లాలో అన్ని విభాగాలకు సంబంధించి 600లకుపైగా సిబ్బంది అవసరమని గతంలో పోలీస్‌ శాఖ ప్రభుత్వానికి నివేదిక అందించినట్టు సమాచారం. అయితే, మూడేళ్ల తర్వాత కేవలం 160 పోస్టులను మాత్రమే భర్తీ చేస్తున్నట్టు నోటిఫికేషన జారీ అయ్యింది.

వారంతపు సెలవు కలగానే..

పోలీసు సిబ్బందికి వారాంతపు సెలవు హామీ నేటికీ అమలు కాలేదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ అధినేత వైఎ్‌స.జగన్మోహనరెడ్డి వారాంతరపు సెలవులు పోలీసులకు ఇస్తానంటూ వాగ్దానం చేశారు. అయితే, మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ అమలు కాలేదు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే జిల్లా పోలీసు శాఖలో సిబ్బంది కొరత అధికంగా ఉండటంతో వారాంతరపు సెలవులు ఇచ్చే అవకాశం లేదు. దీనికితోడు పనిభారం అధికంగా పెరగడంతో పలువురు పోలీసు సిబ్బంది మానసిక, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు.

వయోపరిమితి దాటిందని..

పోలీసు ఉద్యోగాలను పొందడం ఓ కలగా నిరుద్యోగులు భావిస్తారు. ఈ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారు మరే ఉద్యోగాలకు వెళ్లేందుకు ఇష్టపడరు. ఈ క్రమంలోనే 2018లో పోలీసు రిక్రూట్‌మెంట్‌ కోసం నోటిఫికేషన విడుదలైంది. అప్పట్లోనే 5లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. అప్పట్లో ప్రస్తుత సీఎం జగన్మోహనరెడ్డి ప్రతి ఏడాది పోలీసు శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన విడుదల చేస్తానని హామీ ఇచ్చారు. అయితే, అధికారం చేపట్టి మూడేళ్లు దాటాక అరాకొరాగా పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన విడుదల చేసింది. అయితే పలువురు నిరుద్యోగులు మూడేళ్లపాటు పోలీసు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నామని, ఇప్పుడు నోటిఫికేషన విడుదలయ్యే సమయానికి తమకు వయోపరిమితి దాటి పోయిందని వాపోతున్నారు. ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని ఆవేదన చెందుతున్నారు.

Updated Date - 2022-12-01T23:18:28+05:30 IST