Letter to CM.. జర్నలిస్టుల సమస్యలపై సీఎం జగన్కు ఎమ్మెల్యే అనగాని లేఖ
ABN , First Publish Date - 2022-08-14T18:36:36+05:30 IST
జర్నలిస్టుల సమస్యలపై సీఎం జగన్కు టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ లేఖ రాశారు.

అమరావతి (Amaravathi): జర్నలిస్టుల సమస్యలపై సీఎం జగన్ (CM Jagan)కు టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ (Anagani Satya Prasad) లేఖ (Letter) రాశారు. వైసీపీ (YCP) పాలనలో ప్రభుత్వం నుంచి సహాయ, సహకారాలు అందక జర్నలిస్టులు ఇబ్బందులు పడుతున్నారని, అక్రిడేషన్లు (Accreditations) లేక ఫీల్డులో ఇబ్బందులు పడుతున్నారని, ఫోటోగ్రాఫర్స్, కెమెరామెన్లకు హెల్త్ కార్డులు కూడా లేవన్నారు. కోవిడ్తో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు నేటికీ ఆర్థికసాయం అందలేదన్నారు. జర్నలిస్టులు తమ సమస్యలపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. 2019 నుంచి రాష్ట్రంలో జర్నలిస్టులకు అక్రిడేషన్లు మంజూరు చేయకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.
తెలుగుదేశం పార్టీ హయాంలో 24 వేలమందికి అక్రిడేషన్లు ఇచ్చామని ఎమ్మెల్యే అనగాని చెప్పారు. అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల్లో 50 శాతం రాయితీ ఇవ్వడం జరిగిందన్నారు. దాన్ని జగన్ రెడ్డి మూడేళ్లుగా అటకెక్కించారని ఎద్దేవా చేశారు. విధి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు చంద్రబాబు రూ. 10 లక్షలు ఆర్థికసాయం అందించేవారని తెలిపారు. ఈ మూడేళ్లలో ఒక్క కుటుంబానికి కూడా సాయం అందలేదన్నారు. టీడీపీ హయాంలో జర్నలిస్టులకు మంజూరు చేసిన ఇళ్లస్థలాలను రద్దు చేసి.. వారికి అన్యాయం చేశారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జర్నలిస్టులపై కక్షసాధింపు చర్యలు మానాలని, అర్హులైన జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లు, కెమెరామెన్లకు అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ ఆ లేఖ ద్వారా ముఖ్యమంత్రి జగన్కు విజ్ఞప్తి చేశారు.