AP: రేషన్ దుకాణాలు ఎక్కడా మూతపడవు: మంత్రి కారుమూరు
ABN , First Publish Date - 2022-07-25T21:03:11+05:30 IST
రాష్ట్రంలో 1.46 లక్షల రేషన్ కార్డులు ఉంటే కేంద్రం ఉచిత బియ్యం ఇచ్చింది కేవలం 89 లక్షల మందికేనని..
అమరావతి (Amaravathi): రాష్ట్రంలో 1.46 లక్షల రేషన్ కార్డులు (Ration Cards) ఉంటే కేంద్రం ఉచిత బియ్యం (Free Rice) ఇచ్చింది కేవలం 89 లక్షల మందికేనని రాష్ట్ర పౌరసఫరాల శాఖ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు (Karumuru Nageswararao) అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే పదే పదే కేంద్రానికి విజ్ఞప్తులు చేసినా ఇప్పటికీ పట్టించుకోలేదన్నారు. 89 లక్షల రేషన్ కార్డుదారులతో పాటు అందరికీ ఉచిత బియ్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఆగస్టు మొదటి తేదీ నుంచి రేషన్ దుకాణాల ద్వారా ఉచిత బియ్యం ఇచ్చేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. రేషన్ దుకాణాలు ఎక్కడా మూతపడవని, అలాగే రేషన్ కార్డులూ తగ్గించబోమని స్పష్టం చేశారు. రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియని, గడచిన మూడేళ్ల కాలంలో రూ. 16 వేల కోట్లు పౌరసరఫరాలకు వ్యయం చేశామని మంత్రి కారుమూరు నాగేశ్వరరావు తెలిపారు.