దొంగ మస్టర్లకు ఆస్కారమే లేదు: మంత్రి బూడి

ABN , First Publish Date - 2022-10-11T09:18:30+05:30 IST

ఉపాధి హామీ పథకంలో దొంగ మస్టర్లకు ఆస్కారమే లేదని మంత్రి బూడి ముత్యాలనాయుడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

దొంగ మస్టర్లకు ఆస్కారమే లేదు: మంత్రి బూడి

అమరావతి, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకంలో దొంగ మస్టర్లకు ఆస్కారమే లేదని మంత్రి బూడి ముత్యాలనాయుడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ‘ఉపాధికి సమాధి’ కథనంపై ఆయన స్పందించారు. క్షేత్రస్థాయిలో సిబ్బందిపై ఎలాంటి ఒత్తిడి లేదని, వారు నిర్దేశించుకున్న పనిదినాలకు అనుగుణంగా పనులు పెట్టి మస్టర్లు వేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్‌ఎంఎంఎ్‌స యాప్‌ ద్వారా మస్టర్లు పర్యవేక్షిస్తున్నామన్నారు. లేని పనిదినాలు కోసం ఎలాంటి ఒత్తిడులు లేవన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 92 జట్లు ఇప్పటికే రెండు దఫాలుగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయన్నారు.


కేంద్ర నిధులను ఇతర అవసరాలకు మళ్లించలేదని, గత మూడేళ్లలో వివిధ భవనాల నిర్మాణాలకు రూ.3,739 కోట్లు ఖర్చు పెట్టగా, ఇతర మెటీరియల్‌ పనులకు రూ.4,872 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. కొవిడ్‌ పరిస్థితుల్లో గ్రామాలకు తిరిగొచ్చిన కూలీలందరికీ పనులు కల్పించాలన్న ఉద్దేశంతో కొత్త కార్డులు జారీచేయడం ద్వారా ఐదు నెలల్లో 20 కోట్ల పనిదినాలు కల్పించామని చెప్పారు. తమ ప్రభుత్వం అవార్డుల కంటే పనుల కల్పనకే ప్రాధాన్యమిస్తుందని మంత్రి చెప్పారు.

Updated Date - 2022-10-11T09:18:30+05:30 IST