Viveka హత్య కేసు.. : నిజనిజాల వెలికితీతలో తగ్గేదే లేదు : మంత్రి బొత్స
ABN , First Publish Date - 2022-02-19T19:39:24+05:30 IST
తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి
అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సంచలన విషయాలన్నీ బయటికొస్తుండటంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. అయితే తాజాగా సీబీఐ వివేకానంద రెడ్డి ‘గుండెపోటుతో మరణించారు’ అని ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డే తొలుత ప్రచారం చేశారని సీబీఐ తేల్చి చెప్పడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. దీంతో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున వైసీపీపై విమర్శలు, తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. వీటిపై తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ కౌంటరిచ్చారు.
తగ్గేదే లేదు..!
‘వివేకా కేసులో సమగ్ర విచారణ జరపాలని మేమే కోరాం. నిజనిజాల వెలికితీతలో తగ్గేదే లేదు. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ప్రజల్లో అసంతృప్తిని రేకెత్తిస్తున్నారు. విద్యుత్ సమస్యపై ప్రతిపక్షాలు రాద్దాంతం చేశాయి. ఇళ్ల నిర్మాణం లెక్కల్లో టీడీపీ బహిరంగ చర్చకు వచ్చే దమ్ముందా..?. ఇళ్ల నిర్మాణంలో అవకతవకలను అచ్చెన్నాయుడు నిరూపించాలని నేను సవాల్ చేస్తున్నా. ఆయన ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. భోగాపురం విమానాశ్రయ భూముల కుంభకోణంపై పూర్తిస్థాయి విచారణ జరిపి వాస్తవాలు బహిర్గతం చేస్తాం’ అని బొత్స చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేతల నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.