వైసీపీ దళిత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జవహర్ లేఖ
ABN , First Publish Date - 2022-03-08T17:05:37+05:30 IST
వైసీపీ దళిత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాజీ మంత్రి కె.ఎస్. జవహర్ మంగళవారం బహిరంగ లేఖ రాశారు.
అమరావతి: వైసీపీ దళిత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాజీ మంత్రి కె.ఎస్. జవహర్ మంగళవారం బహిరంగ లేఖ రాశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాలనలో దళితులకు జరుగుతున్న అన్యాయం, మోసంపై చట్టసభల్లో నోరు విప్పాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్రెడ్డి పాలనలో దళితులు అడుగడుగునా అన్యాయానికి, అవమానానికి గురవుతున్నారని చెప్పారు. టీడీపీ హయాంలో దళితులకు అమలు చేసిన సంక్షేమ పథకాలు నిలిపివేశారని మండిపడ్డారు. సెంటు పట్టా పేరుతో వేలాది ఎకరాల దళితుల భూములు లాక్కున్నారన్నారు. సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారని జవహర్ లేఖలో విన్నవించారు.
వైసీపీ పాలనలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు పెరిగాయాని ధ్వజమెత్తారు. దళితుల ఆర్తనాదాలు వినిపించని రోజు లేదన్నారు. డా. సుధాకర్, ఓం ప్రతాప్, చీరాల కిరణ్ వంటి ఎందరో దళితుల ప్రాణాల్ని వైసీపీ ప్రభుత్వం బలితీసుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. దళిత మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలు నిత్యకృత్యమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నింటిపై దళిత ప్రజాప్రతినిధులు నోరు విప్పాలని కోరారు. దళితులకు జగన్మోహన్రెడ్డి చేస్తున్న అన్యాయంపై చట్టసభల సాక్షిగా ఆయన్ని నిలదీయాలని దళిత జాతి కోరుకుంటోందని జవహర్ లేఖలో తెలిపారు.