బీజేపీ నేతలపై దాడి వైసీపీ దౌర్జన్యాలను వెల్లడిస్తోంది: Nadendla
ABN , First Publish Date - 2022-06-29T15:08:59+05:30 IST
ధర్మవరం ప్రెస్క్లబ్లో బీజేపీ నేతలపై వైసీపీ నేతల దాడి చేసిన ఘటనపై జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు.
అమరావతి: ధర్మవరం ప్రెస్క్లబ్లో బీజేపీ నేతల(BJP leaders)పై వైసీపీ నేతల దాడి చేసిన ఘటనపై జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadendla manohar) స్పందించారు. ధర్మవరంలో బీజేపీ నేతలపై వైసీపీ వాళ్ళు దాడి చేయడం అధికార పక్షం దౌర్జన్యాలను వెల్లడిస్తోందన్నారు. ప్రెస్క్లబ్లో అందరూ చూస్తుండగా దాడికి తెగబడ్డారంటే దాష్టీకాలు ఏ స్థాయికి చేరాయో అర్థం అవుతోందని తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను పాటించే ప్రతి ఒక్కరూ ఈ దాడిని గర్హించాలన్నారు. పోలీసు ఉన్నతాధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించకపోతే నేర ప్రవృతి కలిగిన నాయకులు పేట్రేగిపోతారని నాదెండ్ల మనోహర్ అన్నారు.
కాగా.. వైసీపీ ప్లీనరీ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత గోనుగుంట్ల సూర్యనారాయణపై వైసీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతలు నిన్న ధర్మవరం ప్రెస్క్లబ్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బీజేపీ నేతలపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. కట్టెలు, రాడ్లు చేతిలో పట్టుకుని స్కోర్పియో వాహనాల్లో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అనుచరులు వచ్చారు. ముందస్తు ప్లాన్ ప్రకారం బీజేపీ నేతలపై దాడికి పాల్పడ్డారు. దాడిని పక్కదోవ పట్టించడంలో భాగంగా ఎల్లో కలర్ షర్ట్స్ వేసుకుని వైసీపీ గ్యాంగ్ రావడం గమనార్హం. అయితే బీజేపీ నేతలు దాడికి పాల్పడిన వారిని గుర్తించారు. ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి ముఖ్య అనుచరుడు గొట్లూరు మారుతీ మనుషులుగా చెబుతున్నారు. ఐదు నిమిషాల్లో దొరికిన వారిని దొరికినట్లు వైసీపీ గ్యాంగ్ చితక్కొట్టింది. రోడ్డుపై ఉన్న బీజేపీ నేతలపై వెంటపడి రాడ్లతో దాడికి పాల్పడ్డారు.