జగన్రెడ్డి శ్రీమంతుడు ఎలా అయ్యారు?
ABN , First Publish Date - 2022-12-31T05:06:26+05:30 IST
‘దేశంలోని ముఖ్యమంత్రులందరిలోకి శ్రీమంతుడిగా సీఎం జగన్ ఆకస్మికంగా ఎలా ఎదిగారో, ఆ కిటుకు ఏమిటో ప్రజలకు కూడా చెప్పి వారందరినీ కూడా సిరిమంతులను చేయాలి’’
ఆ కిటుకు చెప్పి ప్రజలందరినీ సిరిమంతులను చేయండి: టీడీపీ
అమరావతి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): ‘‘దేశంలోని ముఖ్యమంత్రులందరిలోకి శ్రీమంతుడిగా సీఎం జగన్ ఆకస్మికంగా ఎలా ఎదిగారో, ఆ కిటుకు ఏమిటో ప్రజలకు కూడా చెప్పి వారందరినీ కూడా సిరిమంతులను చేయాలి’’ అని తెలుగుదేశం పార్టీ సూచించింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య శుక్రవారం ఇక్కడ తమ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘2004 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన రాజశేఖరరెడ్డి తన కుటుంబ ఆస్తులు రూ.2.12 కోట్లు అని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. తర్వాత 2009 ఎన్నికల్లో పోటీ చేసిన జగన్ ఎన్నికల అఫిడవిట్లో తన కుటుంబ ఆస్తి రూ.77 కోట్లని రాశారు. 2011 కడప ఉప ఎన్నిక సందర్భంగా వేసిన అఫిడవిట్లో తన ఆస్తి రూ.445 కోట్లుగా చూపించారు. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి అది రూ.405 కోట్లని చెప్పారు. వైఎ్సఆర్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో హైదరాబాద్లో ప్రభుత్వ స్థలంలో ఉన్న తన ఇల్లు అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వాలని, దరఖాస్తు పెట్టుకొన్నారు. అటువంటి స్థితి నుంచి ఇప్పుడు దేశంలోని సీఎంలందరిలోకి శ్రీమంతుడిగా ఎదగడంలోని రహస్యం ఏమిటో ఆయన ప్రజలకు చెప్పాలి’’ అని రామయ్య అన్నారు.