ఏపీలో పెరిగిన అటవీ విస్తీర్ణం
ABN , First Publish Date - 2022-01-15T09:01:05+05:30 IST
ఆంధ్రప్రదేశ్లో అటవీ విస్తీర్ణం పెరిగింది. 2019తో పోల్చితే రాష్ట్రంలో 647
- రెండేళ్లలో 647 చదరపు కి.మీ పెరుగుదల
- దేశంలోనూ 2,261 చ.కి.మీ. మేర పెరుగుదల
- ఐఎ్సఎ్ఫఆర్-2021 నివేదిక విడుదల
న్యూఢిల్లీ, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్లో అటవీ విస్తీర్ణం పెరిగింది. 2019తో పోల్చితే రాష్ట్రంలో 647 చదరపు కిలోమీటర్ల మేర అటవీ, చెట్ల విస్తీర్ణం పెరిగిందని, అలాగే దేశంలోనూ గత రెండేళ్లలో అటవీ విస్తీర్ణం 2,261 చదరపు కిలోమీటర్ల మేర పెరిగిందని ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్-2021 (ఐఎ స్ఎ్ఫఆర్) వెల్లడించింది. దేశంలోని అటవీ వనరులను అంచనా వేసే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఫ్ఎ్సఐ) ఆధ్వర్యంలో రెండేళ్లకొకసారి (2020-2021) నిర్వహించే ఈ సర్వే నివేదికను కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ గురువారం విడుదల చేశారు.
2019 నివేదికతో పోలిస్తే దేశంలో అటవీ విస్తీర్ణం 1,540 చ.కి.మీ., చెట్ల విస్తీర్ణం 721 చ.కి.మీ. మేర పెరిగినట్టు ఆయన వెల్లడించారు. ఈ రెండేళ్లలో దేశంలోనే అత్యధికంగా ఏపీలో 2.22 శాతం అటవీ విస్తీర్ణం పెరిగిందని, 632 చ.కి.మీ. పెరుగుదలతో తెలంగాణ రెండో స్థానంలో ఉందని ఆయన చెప్పారు. ఒడిసా (537 చ.కి.మీ), కర్ణాటక (155 చ.కి.మీ), జార్ఖండ్ (110 చ.కి.మీ) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఏపీ భౌగోళిక విస్తీర్ణం 1,62,968 చ.కి.మీ. కాగా అందులో అటవీ విస్తీర్ణం 29,784 చ.కి.మీ. ఉందని నివేదిక స్పష్టం చేసింది. ఇది రాష్ట్ర భూభాగంలో 18.28 శాతం. అందులో అత్యంత దట్టమైన అడవుల విస్తీర్ణం 1,994 చ.కి.మీ. కాగా.. మధ్యస్థ దట్టమైన అడవులు 13,929 చ.కి.మీ., మైదాన ప్రాంత అడవుల విస్తీర్ణం 13,861 చ.కి.మీ. మేర ఉన్నాయని తెలిపింది.
అలాగే, రాష్ట్రంలో 31,959 చ.కి.మీ. మేర రిజర్వు ఫారెస్టు, ప్రొటెక్టెడ్ ఫారెస్టు 5,069 చ.కి.మీ, అన్క్లాసిఫైడ్ అడవులు 230 చ.కి.మీ. మేర ఉన్నాయి. మరోవైపు 2019 నివేదికతో పోల్చితే రాష్ట్రంలో వెదరు వనరులు 899 చ.కి.మీ. మేర తగ్గాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 6,104 చ.కి.మీ. మేర వెదురు వనరులు ఉన్నాయి.
అడవుల పెరుగుదలలో నెల్లూరు టాప్
అటవీ విస్తీర్ణం పెరుగుదలలో నెల్లూరు జిల్లా ముందంజలో ఉంది. నెల్లూరులో అత్యధికంగా 127.27 చ.కి.మీ. విస్తీర్ణం మేర అడవులు పెరిగాయి. ఆ తర్వాత స్థానంలో తూర్పు గోదావరి (127.1 చ.కి.మీ), పశ్చిమ గోదావరి (123.91 చ.కి.మీ) జిల్లాలున్నాయి. కాగా, రాష్ట్రంలో అత్యధికంగా తూర్పు గోదావరిలో జిల్లాలో 5121.2 చ.కి.మీ. (39.99 శాతం) అటవీ విస్తీర్ణం ఉంది. ఆ తర్వాత కడప 4,376.03 చ.కి.మీ. (28.49 శాతం), విశాఖపట్నంలో 3773.88 చ.కి.మీ. (33.81 శాతం) అటవీ విస్తీర్ణం ఉంది.