డేంజర్ జోన్లో ప్రభుత్వం
ABN , First Publish Date - 2022-08-18T09:06:37+05:30 IST
Government in danger zone
- హైకోర్టు అనుమతి లేకుండా
- కేసుల ఉపసంహరణకు జీవోలిస్తారా?
- అది కోర్టు ధిక్కరణకు పాల్పడటమే
- సుప్రీం ఆదేశాలను అధ్యయనం చేయరా?
- సర్వోన్నత న్యాయస్థానం చెప్పినా పట్టదా?
- జీవోలను కొట్టేస్తే తీవ్ర పర్యవసానాలు
- మీరే ఓ పరిష్కారంతో కోర్టు ముందుకు రండి
- రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పిన హైకోర్టు
- విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా
అమరావతి, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): తమ అనుమతి లేకుండా ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసులను ఉపసంహరించేందుకు ప్రభుత్వం జీవోలు జారీ చేయడంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా జీవోలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం డేంజర్ జోన్లో ఉందని వ్యాఖ్యానించింది. ప్రజాప్రతినిధులపై కేసుల ఉపసంహరణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చర్యలు ప్రారంభించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు 2020 సెప్టెంబరు 16న తేల్చిచెప్పిందని గుర్తు చేసింది. ఆ ఆదేశాలు పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం కేసుల ఉపసంహరణకు జీవోలు ఇవ్వడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని స్పష్టం చేసింది. కేసుల ఉపసంహరణ కోసం ముందుగా హైకోర్టు నుంచి అనుమతి కోరాలని, అనుమతి వచ్చిన తరువాతే ప్రభుత్వం తగిన ఉత్తర్వులు ఇవ్వాలని స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా అధ్యయనం చేయరా? అని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. హోంశాఖ జారీ చేసిన జీవోలను తాము కొట్టేస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వమే ఓ పరిష్కారంతో కోర్టు ముందుకు రావాలని సూచించింది. విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, జస్టిస్ డీవీఎ్సఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలిచ్చింది. దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసులను విచారించి సాధ్యమైనంత త్వరగా తీర్పులు ఇవ్వాలని బీజేపీ నాయకుడు అశ్వనీకుమార్ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఆ వ్యాజ్యాన్ని విచారించిన సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు అనుమతి లేకుండా ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు ఉపసంహరించడానికి వీల్లేదంటూ 2020 సెప్టెంబరు 16న ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలోనే 2020 నవంబరు 16 నుంచి 2021 ఆగస్టు 25 వరకు రాష్ట్రంలో ప్రజాప్రతినిధులపై కేసులు ఉపసంహరించేందుకు ఎన్ని జీవోలు జారీ చేశారో పరిశీలించేందుకు హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసింది. పలువురు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల ఉపసంహరణకు పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు సిఫారసు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను అందులో ప్రస్తావించింది. మరోవైపు జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై మొత్తం పది కేసుల ఉపసంహరణకు ప్రభుత్వం ఇచ్చిన జీవోలను సవాల్ చేస్తూ ఏపీ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు చెవుల కృష్ణాంజనేయులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలు బుధవారం విచారణకు వచ్చాయి. చెవుల కృష్ణాంజనేయులు తరఫున న్యాయవాది వెంకటేష్ వాదనలు వినిపిస్తూ.. సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ఎమ్మెల్యే ఉదయభానుపై ఉన్న తీవ్రమైన కేసులు ఉపసంహరించేందుకు ప్రభుత్వం జీవోలు ఇచ్చిందన్నారు. కేసులు ఉపసంహరించేందుకు సంబంధిత పీపీలు చర్యలు తీసుకోవాలని, అందుకు విరుద్ధంగా ప్రభుత్వమే కేసుల ఉపసంహరణకు జీవోలు ఇచ్చిందని తెలిపారు.
హైకోర్టు అనుమతి లేకుండా కేసులు ఉపసంహరించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని, ప్రభుత్వ చర్య సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. హోంశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. కేసుల ఉపసంహరణకు ప్రభుత్వం జీవోలు ఇచ్చినా, ప్రక్రియ తుది దశకు చేరలేదన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో హైకోర్టు అనుమతి ఇచ్చిన తరువాతే కేసులు ఉపసంహరిస్తామని తెలిపారు. ఆ వాదనలపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశించినా.. హైకోర్టు అనుమతి పొందకుండా నేరుగా కేసుల ఉపసంహరణకు జీవోలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం డేంజర్ జోన్లోకి వెళ్లిందని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై పరిష్కార మార్గంతో కోర్టు ముందుకు రావాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.