ఎమ్మెల్సీ ఘటనపై జగన్ సమాధానం చెప్పాలి: prattipati pullarao
ABN , First Publish Date - 2022-05-21T17:39:53+05:30 IST
వైసీపీ ఎమ్మెల్సీ బరితెగించి హత్యకు పాల్పడుతుంటే సామాన్యులు ఎవరికీ చెప్పుకోవాలని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.
పల్నాడు: వైసీపీ ఎమ్మెల్సీ బరితెగించి హత్యకు పాల్పడుతుంటే సామాన్యులు ఎవరికీ చెప్పుకోవాలని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... ఎమ్మెల్సీ చేసిన ఘటనపై సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అడిగేవారు లేరని ఇష్టమొచ్చినట్లు చేస్తే ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. వైసీపీ ప్రభుత్వంపై వాస్తవాలు చెప్పిన దళిత మహిళ వెంకాయమ్మపై దాడి చేయటం సిగ్గుచేటని మండిపడ్డారు. పోలీసులు అధికార పార్టీ నేతలకు భయపడి తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా లేకపోవడంతో ఇప్పటికే ప్రజల్లో విశ్వాసం కోల్పోయారని తెలిపారు. గడపగడపకు ప్రభుత్వంకు ఎక్కడా స్పందన లేదన్నారు. ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తూ ఉండటంతో రక్షణ కోసం మళ్లీ బస్సుయాత్ర పెట్టారని చెప్పారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలో చంద్రబాబు పర్యటనకు ప్రజలలో అనూహ్య స్పందన వస్తోందన్నారు. జగన్ను ఇంటికి పంపించేందుకు యువత నుంచి వృద్ధుల వరకు సిద్ధంగా ఉన్నారని ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు.