Electric bus: ఏడుకొండలెక్కిన ‘ఎలక్ర్టిక్ బస్సు’
ABN , First Publish Date - 2022-09-20T02:51:26+05:30 IST
తిరుమలకు ఆర్టీసీ ఎలక్ర్టిక్ బస్సు (Electric bus)ను సోమవారం ఉదయం కొండకు ప్రయోగాత్మకంగా నడిపారు.
తిరుమల: తిరుమలకు ఆర్టీసీ ఎలక్ర్టిక్ బస్సు (Electric bus)ను సోమవారం ఉదయం కొండకు ప్రయోగాత్మకంగా నడిపారు. తిరుపతిలోని అలిపిరి డిపో నుంచి తిరుమల (Tirumala) రెండో ఘాట్ నుంచి కొండపైకి వెళ్లింది. తర్వాత తిరుమలలోనే ఎత్తయిన ప్రదేశమైన శ్రీవారి పాదాల వద్దకెళ్లి.. తిరిగి మొదటి ఘాట్ నుంచి అలిపిరి డిపోకు చేరుకుంది. ఇలానే సాయంత్రం కూడా మరోమారు ఈ బస్సును నడిపారు. మొత్తం రెండు ట్రిప్పులను నడిపి పరీక్షించారు. ఈ క్రమంలో ఎత్తయిన ప్రదేశాల్లో, మలుపుల్లో బస్సు పనితీరును గమనించారు. ఐఐటీ ప్రొఫెసర్లు కూడా ఆర్టీసీ ప్రమాణాల ప్రకారం బస్సు కండీషన్, ఇతర సాంకేతిక పరమైన అంశాలనూ నిశితంగా పరిశీలించారు.వారం రోజుల్లో మరో పది బస్సులు రానున్నాయని, శ్రీవారి బ్రహ్మోత్సవాల్లోనే ఈ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. టికెట్ ధరను కమిటీ త్వరలోనే నిర్ణయిస్తుందని చెప్పారు.